శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 28 డిశెంబరు 2021 (14:08 IST)

సుజనా చౌదరి, సీఎం రమేష్ లకు రాష్ట్ర బీజేపీని లీజుకిచ్చారా?

ప్రజాగ్రహ సభ అంటూ బీజేపీ ఏర్పాటు చేసిన సభ పెద్ద ప్రహసనం అని ఏపీ రవాణా, సమాచార, పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి పేర్ని నాని విమ‌ర్శించారు. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఎజెండా, సిద్ధాంతం లేవ‌ని, కొత్తగా టీడీపీ నుంచి వచ్చి, అక్కడ తీర్థం తీసుకున్నవారికి మాత్రమే వైయస్సార్‌ సీపీ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఆగ్రహం ఉంద‌ని మంత్రి ఎద్దేవా చేశారు.
 
 
జగన్‌ సీఎం అయ్యాక బయట తిరగడం లేద‌ని అంటున్నార‌ని, మరి ప్రధాని రోజూ అదే పనిమీద ఉంటున్నారా? ప్రధానిమంత్రి ఓట్లు కోసమే రోడ్డు మీదకు వస్తార‌ని మంత్రి పేర్ని నాని విమ‌ర్శించారు. చంద్రబాబు ఎజెండా తప్పితే మీకంటూ ఒక ఎజెండా  ఉందా? బ్రాందీ బుడ్డి రేట్లు గురించి కాదు, పెట్రో ధరల గురించి బీజేపీ ఆలోచించాల‌న్నారు. 
 
 
బ్రాందీ బుడ్డి రేట్లు పెంచడం సిగ్గుచేటు అని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు.  ఏపీలో బీజేపీ ప్రభుత్వం రాగానే రూ.75కే బ్రాందీ బుడ్డి ఇస్తారట. ఇది వారి గొప్ప ఎజెండా. ఎంత ముచ్చటగా ఉందంటే .. ఏమాత్రం సిగ్గుపడకుండా ఆనందంగా, తన్మయంతో చెబుతున్నారు. బీజేపీ నాయకులారా...  బ్రాందీ బుడ్డి రేట్లు పెంచినందుకు కాదు మీరు మాట్లాడాల్సింది. దేశలో డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగిపోతున్నందుకు మాట్లాడాల‌ని మంత్రి అన్నారు.
 
 
పెరిగిన ఎరువుల రేట్లు గురించి ఏనాడైనా బాధపడ్డారా? 2014లో ఎరువుల బస్తా రూ.800 ఉంటే ఇవాళ రూ.1700 కు వెళ్లింది. ఏడేళ్లలో డబుల్‌ కన్నా ఎక్కువగా ఎరువుల ధరలు పెంచేశారు. దానికి బాధలేదా మీకు? నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి కదా వాటి గురించి బాధపడండ‌ని హిత‌వు ప‌లికారు. 

 
వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం అని ఏ రైతును అడిగినా చెబుతాడ‌ని, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని దేశమంతా కోడైకూస్తోంద‌న్నారు. మేధావులుగా చెప్పుకునే వారు కొందరు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నదని మాట్లాడుతున్నార‌ని, భారతదేశం జీడీపీలో 21శాతానికి పైబడి అప్పున్న పరిస్థితికి కారణం ఎవర‌ని ప్ర‌శ్నించారు. దేశంలో అప్పు రూ. 135 లక్షల కోట్ల పైమాటే. 2014లో 62 లక్షల కోట్లు ఉంటే... ఇవాళ  రూ. 135 లక్షల కోట్లకు పెరిగింది అంటే, గడిచిన ఏడేళ్లలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెచ్చిన అప్పు ఏకంగా రూ. 73 లక్షల కోట్లు. దాంట్లో రూ.4 లక్షల 27 వేల 925 కోట్లు విదేశీ రుణం. మీరు ఆంధ్రప్రదేశ్‌ అప్పుల గురించి మాట్లాడతారా? ఎంతో క్రమశిక్షణతో, ఆర్థిక చట్టాలను అతిక్రమించకుండా, పేద ప్రజల సంక్షేమం కోసం మేం రుణాలు చేస్తున్నామ‌ని పేర్ని నాని చెప్పారు. 

 
ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు పెద్ద మనుషులకు బీజేపీ లీజ్‌కు ఇచ్చేశార‌ని, టీడీపీ నుంచి కొత్తగా  వచ్చిన సుజనా చౌదరి, సీఎం రమేష్‌కు ఏపీ బీజేపీని లీజుకు ఇచ్చారా? లేదా? వాళ్ళే ఖర్చులు అంతా భరిస్తారు? వాళ్లు ఏం చెబితే అది తీర్మానాలు చేసి, వాళ్లు చెప్పినట్లు పార్టీని నడుపుతారా? ఏపీలో పోలీస్‌ వ్యవస్థను సునిశితంగా టెలీస్కోప్ లో పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ఇక్కడ నుంచి అధికారులను రీకాల్‌ చేస్తారట? ఏం అధికారం ఉందని, ఏ హోదాతో మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని లీజ్‌కు తీసుకున్నామనే దమ్ము, ధైర్యంతోనే కదా ఈ భాష వారు ఉపయోగిస్తున్నార‌ని మంత్రి పేర్ని నాని చెప్పారు.  

 
భారతీయ జనతా పార్టీ నాయకులే 2019 వరకూ అమరావతిని స్కామ్‌ క్యాపిటల్‌ అని మాట్లాడార‌ని,  ఆంధ్రప్రదేశ్‌కు చెంబుడు నీళ్లు, చిప్పడు మట్టి తమ మొహాన కొట్టారని చంద్రబాబు నాయుడు అన్నా... మీరు తుడుచుకుని వెళ్లిపోతార‌ని ఎద్దేవా చేశారు. 

 
ఇది నూటికి నూరుపాళ్లు తెలుగుదేశం అంటే నరనరానా జీర్ణించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీని లీజుకు తీసుకున్న ఇద్దరు రాజకీయ నాయకుల ప్రేరేపిత, టీడీపీ భావజాలం వ్యక్తపరిచే సభ తప్పితే మరొకటి కాద‌న్నారు. ఆఖరికి బీజేపీ సభకు జనం రాకుంటే, జ‌నాన్ని పంపించే బాధ్యత కూడా చంద్రబాబు తీసుకున్నార‌ని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ, సీపీఐ, జనసేన ఇలా ఏ పార్టీ అయినా జెండాలు వేరు కానీ, ఆ జెండాల కర్ర మాత్రం పసుపు పచ్చ కర్రే అని ఎద్దేవా చేశారు.