శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జూన్ 2020 (16:31 IST)

నంద్యాల ఫ్యాక్టరీలో అమోనియా గ్యాస్ లీక్.. ఒకరి మృతి.. ప్రజల ఆందోళన

Ammonia gas leak
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని ఫ్యాక్టరీలో అమోనియా గ్యాస్ లీకైన ఘటనలో ఒకరు మృతి చెందారు. విశాఖ గ్యాస్‌ దుర్ఘటనను మరువక ముందే కర్నూలులో గ్యాస్ లీకైన ఘటన జనాలను భయాందోళనలకు గురిచేసింది. ఈ సంఘటనలో మరికొంత మంది అస్వస్థతకు గురయ్యారు. మాజీ ఎంపీకి చెందిన ఎస్పీవై ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీ నుంచి శనివారం విషవాయువు లీకేజీ అయ్యింది.
 
దీంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటనలో కంపెని జనరల్‌ మేనేజర్‌ మృతి చెందగా మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.   విషయం తెలుసుకున్న అగ్నిమాపక, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన కార్మికులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  
 
 ఆగ్రోప్లాంట్‌ చుట్టూ గ్యాస్‌ వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్‌ లీక్‌ ఘటనపై జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ స్పందించారు. కంపెనీ లోపల మాత్రమే గ్యాస్‌ లీకైందని, బయట గ్యాస్‌ లీక్‌ ప్రమాదం లేదని స్పష్టం చేశారు.శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో కంపెనీ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మృతి చెందినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. గాయాలపాలైన మరో ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కలెక్టర్‌ వీరపాండియన్‌ సంఘటనా స్థలానికి చేరుకుసి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.