శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (08:14 IST)

సంక్రాంతి బస్సుల్లో ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.. ఏంటది?

apsrtc
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి బస్సుల్లో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు రానుపోను టిక్కెట్ రిజర్వు చేసుకుంటే ప్రయాణ చార్జీలో పది శాతం రాయితీ ఇస్తామని తెలిపింది. 
 
సంక్రాంతి పండుగ కోసం తమతమ సొంతూర్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ ఏకంగా 6400 ప్రత్యేక బస్సులను నడుపుతున్న విషయం తెల్సిందే. ఈ బస్సుల్లో అదనపు బాదుడుకు ఆర్టీసీ అధికారులు స్వస్తి చెప్పారు. అదేసమయంలో ప్రత్యేక రాయితీని కల్పించారు. 
 
జనవరి 6 నుంచి 14 తేదీ వరకు, అలాగే రద్దీని బట్టి జనవరి 15 నుంచి 18 వరకు ఆయా బస్ డిపోల నుంచి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. రానుపోను టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు పది శాతం రాయితీని ప్రకటించింది. 
 
గత యేడాదితో పోలిస్తే ఈదఫా ఆర్టీసీని ఆదరించే ప్రయాణికుల సంఖ్య 63 శాతం నుంచి 68 శాతానికి పెరిగినట్టు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. గత యేడాది నవంబరు నాటికి 2623 కోట్ల రూపాయల మేరకు ఆదాయం రాగా, ఈ దఫా రూ.3866 కోట్ల మేరకు పెరిగినట్టు చెప్పారు. 
 
కార్గో ఆదాయంలోనూ భారీ పెరుగదల కనిపించిందన్నారు. గత ఆర్థిక ఆర్థిక సంవత్సరంలో రూ.122 కోట్ల ఆదాయం రాగా, ఈ యేడాది మరోమూడు నెలలు మిగిలివుండగానే ఇప్పటికే రూ.119 కోట్లు దాటేసిందని ఆయన వెల్లడించారు.