గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2019 (09:08 IST)

నిమ్మగడ్డ ప్రసాద్ కి అరెస్ట్ వారెంట్

ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కి సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇందు టెక్ జోన్ వ్యవహారంలో ఈడీ నమమోదు చేసిన కేసులో నిమ్మగడ్డకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

ఈ కేసులో నిమ్మగడ్డ వ్యక్తిగతంగా హాజరుకాకపోగా.. ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన తరఫు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేయలేదు. దీంతో న్యాయమూర్తి ఈ వారెంట్‌ జారీచేశారు. 
 
నేర విచారణ చట్టం సెక్షన్‌ 317 (హాజరు మినహాయింపు) కింద పిటిషన్‌ దాఖలు చేసేందుకు తమకు ఎటువంటి సమాచారం లేదని ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు నివేదించారు. నిమ్మగడ్డను సెర్బియా పోలీసులు గత వారం అరెస్టు చేసిన విషయాన్ని ఈడీ అధికారులకు తెలియజేశామన్నారు.

ఇదే విషయాన్ని తెలియజేస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈడీ తరఫు న్యాయవాదులు హాజరుకాకపోవడంతో ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను న్యాయమూర్తి కోర్టుకు పిలిచారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరగా.. ఈడీ తరఫు న్యాయవాది సెలవులో ఉన్నారని, కొత్త న్యాయవాదిని నియమించుకునేందుకు గడువు కావాలని కోరారు.

న్యాయవాదిని నియమించుకున్నాక మెమోపై స్పందిస్తామన్నారు. తదుపరి విచారణను న్యాయమూర్తి ఈనెల 23కు వాయిదా వేశారు. కాగా.. సెర్బియా పోలీసుల కనుసన్నల్లో ఉన్న నిమ్మగడ్డను భారత్ కి రప్పించేందుకు ఆయన తరఫు న్యాయవాదులు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.