1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 20 అక్టోబరు 2021 (16:06 IST)

ప‌థ‌కం ప్ర‌కారం... అధికార పార్టీ క‌నుస‌న్న‌ల్లోనే దాడులు

రాష్ట్రవ్యాప్తంగా ఒక పథకం ప్రకారమే, అధికార పార్టీ కనుసన్నల్లో దాడులు జరిగాయని, టీడీపీ నేతలు, కార్యకర్తలు, కార్యాలయాలపై జరిగిన దాడులు అనుకోకుండా జరిగినవి కావని, పథకం ప్రకారమే జరిగాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. దాడి జరిగిన గుంటూరు జిల్లా మంగళగిరి లోని టిడిపి కేంద్ర కార్యాలయాన్ని బుధ‌వారం ఆయన సందర్శించి పరిశీలించారు. ప్రతిపక్షాలుగా తాము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి అనైతిక, రాజ్యాంగవిరుద్ధ చర్యలను ప్రశ్నిస్తూనే ఉంటామని, ఎవరినీ వదిలేది లేదని రామకృ ష్ణ తేల్చి చెప్పారు. రాజ్యాంగబద్దంగా ప్రతిపక్షాలకు కొన్నిహక్కులు ఉంటాయని, వాటిని కాలరాసేలా తనకు అధికారముందని, గూండాయిజాన్ని ప్రోత్సహిస్తే, అదే గూండాయిజానికి బలయ్యేది కూడా వారేనని రామకృష్ణ హెచ్చరించారు. 
 
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టేలా వ్యవహరిస్తున్న తీరుని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, జనసేన, లోక్ సత్తాలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మేథావులు, రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు ముందుకు రావాలన్నారు. డీజీపీ కార్యాలయం పక్కనే ఇటు వంటి ఘటనలు జరిగితే, ఎటువంటి చర్యలు తీసుకోలేని స్థితి లో ఆయన ఉన్నారంటే, అది ఆయనకే సిగ్గు చేటన్నారు. హోంమంత్రి కూడా తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం సహా, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడులపై ముఖ్యమంత్రి తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.