గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 జులై 2019 (12:02 IST)

జగనన్నకు సారీ చెప్తాం.. పార్టీలో చేర్పించు అమ్మా... విజయమ్మతో అఖిలప్రియ

కర్నూలు జిల్లాలో రాజకీయాలను శాసించిన నేతలు భూమా నాగిరెడ్డి - శోభా నాగిరెడ్డి. వీరిద్దరూ ఇపుడు లేరు. దీంతో వీరి వారసులుగా భూమా అఖిల ప్రియా రెడ్డి, భూమా బ్రహ్మానంద రెడ్డిలు రాజకీయాల్లో ఉన్నారు. భూమా అఖిల ప్రియా రెడ్డి తొలుత వైకాపాలో ఉండి.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. పైగా, గత టీడీపీ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా కూడా పని చేశారు. ఆ సమయంలో జగన్ మోహన్ రెడ్డితోపాటు.. వైకాపా నేతలపై ఆమె విమర్శలు గుప్పించారు. 
 
కానీ, ఇపుడు సీన్ రివర్స్ అయింది. గత ఎన్నికల్లో ఆమె ఓడిపోగా, టీడీపీ అధికారానికి దూరమైంది. గతంలో తాను దూషించిన నేతలంతా ఇపుడు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో ఆమె చూపు వైకాపాపై పడింది. రాజకీయంగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ఆమె జగన్ చెంతకు చేరాలని భావిస్తున్నారు. ఇందుకోసం జగన్ తల్లి వైఎస్. విజయమ్మకు దగ్గరయ్యారు. ఆమె ద్వారా పార్టీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. 
 
జగన్ అన్నకు క్షమాపణలు చెప్తాం.. తమను పార్టీలో చేర్చుకునేలా ఒప్పించు అమ్మా అంటూ ప్రాధేయపడింది. కానీ, ఈ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. దీంతో తమను జగన్ చెంతకు తీసుకెళ్లగలిగే నేత కోసం ఆమె ఆరా తీస్తున్నారు. పైగా, తమ ప్రత్యర్థి వర్గం గంగుల ఫ్యామిలీ వైకాపాలో ఉంది. ఇలాంటి సమయంలో భూమా వర్గం వైకాపాలో చేరేందుకు గంగుల వర్గం సమ్మతిస్తుందా అన్నది ఇపుడు ప్రశ్నార్థంగా మారింది. పైగా, జగన్ సైతం భూమా ఫ్యామిలీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెల్సిందే.