1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 మే 2023 (13:53 IST)

ఏపీ ప్రభుత్వానికి ఊరట... సిట్‌పై సుప్రీం కీలక తీర్పు

amaravati lands
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి భూకుంభకోణం, భారీ ప్రాజెక్టుల్లో అవినీతి చోటుచేసుకుందని పేర్కొంటూ విచారణ జరిపేందుకు వైకాపా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటుచేసింది. దీనిపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా, సిట్‌పై మధ్యంతర స్టే విధించింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించింది. సిట్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసును మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవి కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం సూచన చేసింది.
 
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసమేనా? అని ప్రశ్నించింది. హైకోర్టుకు ముందుగా ఈ విషయంలో జోక్యం చేసుకుందని అందుకే మధ్యంతర ఉత్తర్వులను తోసిపుచ్చుతున్నట్టు వెల్లడించింది. 
 
కాగా, గత ప్రభుత్వ విధాన నిర్ణయాలపై దర్యాప్తు కోసమని ఐపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందన్నారు. దీన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సిట్‌పై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులోనే ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.