శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (15:17 IST)

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ఉండకపోవచ్చు : జీవీఎల్ నరసింహారావు

బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు బాంబు పేల్చారు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి కొనసాగే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. దీనికి కారణం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. గత ఐదేళ్ళలో కనీసం ఒక్క పక్కా భవనం కూడా ఆయన నిర్మించలేకపోయారనీ, అందువల్లే ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగే అవకాశాలు లేవన్నది తన అభిప్రాయమన్నారు. 
 
ఇప్పటికే ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్న విషయం తెల్సిందే. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ విపక్ష టీడీపీ వ్యాఖ్యానిస్తోంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నది స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.
 
ఏపీ మంత్రులు కూడా పదే పదే వ్యాఖ్యలు చేస్తుండటంతో అనిశ్చితి మరింత పెరుగుతోంది తప్ప, అది రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనకరంకాదన్నారు. రాజధాని విషయంలో ఏపీ మంత్రులపై ఒత్తిళ్లు వస్తుండొచ్చేమోనని వ్యాఖ్యానించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాట ఆడకుండా తన విధానం ఏంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
 
ఈ పరిస్థితులన్నింటికీ మూలకారణం చంద్రబాబేనని అని అన్నారు. ఆయన గత ఐదేళ్ళ కాలంలో ఒక్క పక్కా భవనం కూడా నిర్మిచంలేకపోయారన్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు సర్కారు చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయని చెప్పుకొచ్చారు.