శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 జూన్ 2020 (17:04 IST)

ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలాన్ని మరో మూడు నెలల పాటు పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నీలం సాహ్ని పదవీకాలం పొడిగించాలని ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. 
 
వాస్తవానికి నీలం సాహ్ని పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఆమె పదవీకాలాన్ని పొడగించాలని కోరుతూ కేంద్రానికి ఏపీ సర్కారు లేఖ రాసింది. ఈ లేఖను పరిశీలించిన కేంద్రం.. ఆమె పదవీకాలాన్ని జులై 1వ తేదీ నుంచి సెప్టెంబరు 30వరకు పొడగించింది. 
 
గత ఏడాది నవంబరు 13న నీలం సాహ్ని ఏపీ సీఎస్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె కేంద్ర సర్వీసులు నుంచి రిలీవ్ అయి ఏపీ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఏపీ సీఎస్‌గా పనిచేస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం బదిలీ చేసింది. 
 
ఆయన స్థానంలో నీరబ్ కుమార్‌ ప్రసాద్‌కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత సాహ్ని ఏపీ సీఎస్‌గా పూర్తిస్థాయిలో భాద్యతలు చేపట్టారు. 1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ కాలం పనిచేశారు. 
 
ఉమ్మడి ఏపీలో మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా కూడా పని చేశారు. అంతేకాకుండా నల్గొండ జాయింట్ కలెక్టర్‌, కలెక్టర్‌గా పనిచేశారు. ముస్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టరుగా కూడా ఉన్నారు.