1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (14:08 IST)

సీఎం జగన్ హస్తిన టూర్ ఎందుకు రద్దు అయింది?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయింది. నిజానికి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ ఢిల్లీకి చేరుకోవాల్సివుంది. ఈ రోజు ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని వివిధ అంశాలపై చర్చలు జరపాల్సివుంది. కానీ, మంగళవారం ఉదయం ఈ పర్యటన రద్దు అయింది. 
 
సరిగ్గా మరో రెండు మూడు గంటల్లో ఢిల్లీకి బయల్దేరాల్సి ఉండగా సడన్‌గా ఆ పర్యటన రద్దు అయ్యిందని వార్తలు వస్తున్నాయి. పర్యటనలో భాగంగా మొదట కేంద్ర మంత్రి అమిత్ షాతో ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులు, కీలక అధికారులతో భేటీ కావాల్సి ఉంది.
 
అయితే ఉన్నట్టుండి పర్యటన ఎందుకు వాయిదా పడింది..? అపాయింట్మెంట్లు ఏమైనా రద్దయ్యాయా..? లేకుంటే మరేమైనా కారణాలున్నాయా..? అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ఇంతవరకూ సీఎంవో నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు వైసీపీ నేతలు, మంత్రులు కూడా స్పందించలేదు.
 
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ఇలా జరిగాల్సివున్నది. మంగళవారం ఉదయం 10.30కి గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన బయల్దేరి.. ఒంటిగంటకు ఢిల్లీ విమానాశ్రయం చేరుకోవాల్సి ఉంది. అక్కడి నుంచి నేరుగా జన్‌పథ్‌-1లోని తన నివాసానికి వెళ్తారని.. అనంతరం హోం మంత్రి అమిత్‌ షాతో పాటు ఆర్థిక, జలశక్తి మంత్రులు నిర్మలా సీతారామన్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తదితరులను కూడా ఆయన కలుస్తారని నిన్నట్నుంచి వార్తలు వస్తున్నాయి.
 
ఈ వరుస భేటీల్లో భాగంగా రాష్ట్రానికి సాయం అందించాల్సిందిగా అభ్యర్థిస్తారని, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరతారని అధికార వర్గాలు సోమవారం మీడియాకు వెల్లడించారు. 
 
వీటితో పాటు ముఖ్యమంత్రిగా ఏడాది పాలనలో తీసుకునే అనేక నిర్ణయాలను హైకోర్టు తప్పుపట్టడం.. వాటికి సంబంధించి జగన్‌ తమ వైఖరిని అమిత్‌షాకు వివరించే అవకాశమున్నట్లు కూడా సోమవారం నుంచి వార్తలు వినిపించాయి. 
 
మరీ ముఖ్యంగా శాసన మండలి రద్దుకు సహకరించాలని కేంద్రాన్ని కోరతారని, రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ కూడా అమిత్ షా ఎదుట జరుగుతుందని భావించారు. కానీ, జగన్ తన పర్యటనను ఉన్నట్టుండి రద్దు చేసుకున్నారు.