1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 17 జూన్ 2024 (10:40 IST)

విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై కేంద్రం కన్నెర్ర!!

రోజు వారీ విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై కేంద్రం కన్నెర్ర జేసింది. ముఖ్యంగా, అనేక మంది ఉద్యోగులు విధులకు ఆలస్యంగా రావడం, బయోమెట్రిక్ నమోదు చేయకపోవడాన్ని గుర్తించారు. దీనిపై కేంద్రం సీరియస్ అయింది. పైగా, తరచూ ఆలస్యంగా వచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. 
 
కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆధార్‌తో అనుసంధానమైన బయోమెట్రిక్ వ్యవస్థలో పలువురు ఉద్యోగులు తమ హాజరు నమోదు చేయడం లేదని, మరికొందరు తరచూ ఆలస్యమవుతున్నారని గుర్తించినట్టు తెలిపింది. 
 
మొబైల్ ఫోన్ ఆధారిత ముఖ, గుర్తింపు వ్యవస్థను వాడి ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో గుర్తించగలిగేలా చేయవచ్చని సూచించింది. అన్ని విభాగాలు, శాఖలు, సంస్థలు తరచూ తమ ఉద్యోగుల హాజరు నివేదికల్ని పర్యవేక్షించాలని పేర్కొంది.
 
'ఆలస్యంగా వచ్చిన ఒక్కో రోజుకు ఒక పూట సాధారణ సెలవు చొప్పున కోతపెట్టాలి. ఒకవేళ సీఎల్‌లు లేకపోతే ఆర్జిత సెలవుల నుంచి తగ్గించాలి. తగిన కారణాలు ఉన్నట్టయితే మాత్రం నెలలో గరిష్ఠంగా రెండుసార్లు, రోజుకు గంటకు మించకుండా ఆలస్యంగా రావడాన్ని క్షమించవచ్చు. ముందుగానే కార్యాలయం నుంచి వెళ్లిపోవడాన్ని ఆలస్యంగా రావడంతో సమానంగానే పరిగణించాలి' అని తాజాగా ఉత్తర్వుల్లో తెలిపింది.