శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (20:14 IST)

రోడ్డుకు అడ్డంగా వాహనం నిలిపి చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు

police vehicle
తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీలోని వైకాపా ప్రభుత్వం పగటిపూటే చుక్కలు చూపిస్తుంది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వైకాపా నేతలు నడుచుకుంటున్నారు. వీరికి పోలీసులు కూడా తమ వంతు సహకారం అందిస్తూ పోలీసులు వైకాపా కార్యకర్తల తరహాలో, ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారు. దీనికి నిదర్శనమే చంద్రబాబు ప్రయాణించే కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా పోలీసు వాహనాన్ని అడ్డుపెట్టారు. దీంతో చంద్రబాబు కానినడక నడిచి వెళ్లేందుకు ముందుకు సాగితే ఆయన ముందుకు అడుగు వేయకుండా పోలీసులు రోడ్డుపై అడ్డంగా కూర్చొన్నారు. దీంతో పోలీసుల చర్యకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఫలితంగా పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకుంది.
police force
 
ప్రస్తుతం చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన అనపర్తికి వస్తుండగా పోలీసులు బాబు కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. బలభద్రపురం వద్ద చంద్రబాబు వాహనం ముందుకు కదలకుండా పోలీసులు రోడ్డుపైనే బైఠాయించారు. ఆయన కాన్వాయ్‌కి పోలీసు బస్సును అడ్డం పెట్టారు. చంద్రబాబును అడ్డుకున్నారన్న సమాచారంతో పరిసర గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాంతో చంద్రబాబు పోలీసులపై నిప్పులు చెరుగుతూ బలభద్రపురంలో ప్రసంగించారు.  
 
పోలీసుల వైఖరికి తాను తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నానని, పోలీసులు తనకు సహకరించడంలేదని, ఇకపై తాను కూడా పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నానని ప్రకటించారు. "మీరు చట్టప్రకారం పనిచేయడంలేదు. మీరు నాకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నారు? ఎవరో సైకో చెప్పాడని నన్ను ఆపేస్తారా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
police force
 
1921లో మహాత్మాగాంధీ నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం ఏర్పడిందని, తర్వాత కాలంలో అది దండియాత్రగా మారిందని, బ్రిటీష్ పాలన పతనానికి నాంది పలికిందని అన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు. ఎంత మందిపై కేసులు పెడతారో నేనూ చూస్తా అని హెచ్చరించారు. చివరికి మీరు సైకోని కూడా రక్షించలేరని, ఇవాళ ప్రజా ఉద్యమానికి నాంది పలుకుతున్నానని పిలుపునిచ్చారు. ఇది పోలీసు రాజ్యం కాదు... రౌడీ రాజ్యం అంటూ మండిపడ్డారు. 
 
మీరు అనుమతిస్తారా... లేదా నన్నే ముందుకు వెళ్లమంటారా? అంటూ పోలీసులకు అల్టిమేటమ్ ఇచ్చారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో, చంద్రబాబు కాలినడకన అనపర్తి బయల్దేరారు. ఆయన వెంట టీడీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో ఓ పాదయాత్రను తలపించింది. కాగా, చంద్రబాబు పర్యటనలో రోడ్ షోకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.