శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2019 (16:06 IST)

నా చిరకలా మిత్రుడు ఇకలేరు... శివప్రసాద్ మృతిపై బాబు సంతాపం

తన చిరకాల మిత్రుడు శివప్రసాద్ ఇకలేరనే వార్తను తాను జీర్ణించుకోలేక పోతున్నట్టు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. కిడ్నీ సంబంధిత వ్యాఖ్యలతో బాధపడుతూ వచ్చిన చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత ఎన్. శివప్రసాద్ ఆదివారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
శివప్రసాద్ మృతిపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 'నా చిరకాల మిత్రుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు, టీడీపీ నేత, డా.ఎన్ శివప్రసాద్‌‌గారి మరణం విచారకరం. ప్రత్యేకహోదా సహా విభజన చట్టంలో హామీల అమలు కోసం ఆయన రాజీలేని పోరాటం చేశారు. ఆయన మృతి చిత్తూరు జిల్లాకే కాకుండా, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తీరని లోటు' అని వ్యాఖ్యానించారు. శివప్రసాద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవడం టీడీపీకి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. 
 
అలాగే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా స్పందించారు. చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మృతికి చింతిస్తున్నానని ట్వీట్ చేశారు. శివప్రసాద్ మృతి టీడీపీకి తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. 
 
తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేశారని, ఏపీకి ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్ వేదికగా తనదైన శైలిలో పోరాటం సాగించారని కొనియాడారు. రాజకీయనాయకుడిగానేకాకుండా సినీ కళాకారుడిగా కూడా ఆయన ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారని కీర్తించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.