శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (14:59 IST)

సీఎం జగన్ పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నారు : చంద్రబాబు సెటైర్లు

వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇపుడు పెద్ద పతివ్రతలా పాల్పడుతున్నారంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పైగా, రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర చర్యల వల్ల పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందంటూ మండిపడ్డారు. 
 
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల కల అని... ఏ ఒక్కరినీ సంప్రదించకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేశారని ఆగ్రహించారు. ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును ఆపేశారన్నారు. ఇంత భారీ ప్రాజెక్టులు దేశ చరిత్రలో ఎప్పుడూ రివర్స్ టెండరింగ్‌కు పోలేదని గుర్తుచేశారు. ఇది రివర్స్ టెండరింగ్ కాదని... రిజర్వ్ టెండరింగ్ అని ధ్వజమెత్తారు. 
 
పోలవరం విషయంలో ముఖ్యమంత్రి బంధువు పీటల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినా, నిపుణులు హెచ్చరించినా వినకుండా జగన్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించడం... మా ఇంటికి నోటీసులు అందించినంత ఈజీ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 
 
మరో ఏడాది కష్టపడి ఉంటే పోలవరం పూర్తయ్యేదని అన్నారు. పోలవరంపై మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఒక పతివ్రతలా, నీతిమంతుడిలా మాట్లాడుతున్నారని... ఇప్పటివరకు పనిచేసిన ముఖ్యమంత్రులు, మంత్రులంతా తెలివిలేని వారా? అని మండిపడ్డారు. 
 
గోదావరిలో బోటు మునిగిపోతే కనిపెట్టలేనివారు... రివర్స్ టెండరింగ్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని మీడియా ఈ టెర్రరిస్టు ప్రభుత్వాన్ని చూసి భయపెడుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.