1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (11:59 IST)

#TDP మహానాడు లైవ్ : ఒక్కో కార్యకర్త ఐదు మందికి అన్నం పెట్టండి : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేస్తూ కరోనా కష్టకాలంలో ఒక్కో టీడీపీ కార్యకర్త కుదిరితే ఐదుమందికి అన్నం పెట్టాలని పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో కూడా ఊహించని విపత్తును ప్రస్తుతం ఎదుర్కొంటున్నాం. కరోనాకు పరిష్కారం ఉందా లేదా అనే భయంతోనే అనేక మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. 
 
మరికొంత మంది ఆర్ధిక పరిస్థితులు భరించలేక కరోనా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రజలు కరోనా బాధితులకు, సమాజానికి అండగా నిలవాలి. మనల్ని, మన కుటుంబాలను కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. సమాజంపై ఉండే బాధ్యతతో కరోనా బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. అమెరికాలో ఉండే డాక్టర్ లోకేశ్వరరావు ఆధ్వర్యంలో వందలాది మందికి వైద్య సలహాలు అందిస్తున్నాం. 
 
కరోనా సోకిన తొలి రోజుల్లోనే టెలీమెడిసిన్ సేవలు పొందితే సులభంగా కోలుకోవచ్చు. పేదలకు అవసరమైన మందులు అందించేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. ప్రజలకు సేవలందించేందుకు ముందుకొచ్చేవారికి ప్రభుత్వం సహకరించాలి. ప్రతి టీడీపీ కార్యకర్తా.. కరోనా బాధితులకు అండగా నిలవాలి. కుదిరితే ఒక్కో కార్యకర్త కనీసం ఐదు మందికి అన్నం పెట్టండి. శక్తి మేరకు అండగా ఉండేలా పాటుపడాలి. 
కరోనా మొదటి వేవ్ వచ్చాక ప్రభుత్వం సరిగా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వేవ్ 2 ఉధృతమైంది. 
 
కరోనా వేవ్ 3 చిన్న పిల్లలకు కూడా ప్రమాదకరం అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అప్రమత్తం కావాలి. వెంటనే వైద్య సదుపాయాలు సమకూర్చుకోవాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజల ప్రాణాలు పోతున్నాయనేది ముమ్మాటికీ నిజం. 
కరోనాపై ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి మాస్కు పెట్టుకోకుండా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు. ప్రజలకు అండగా ఉండేందుకు ప్రైవేటు వ్యక్తులు క్వారంటైన్ సెంటర్లు పెడుతుంటే తీసేస్తున్నారు. కరోనా బాధితులకు ఆహార సరఫరా చేస్తుంటే పోలీసుల్ని పంపించి అడ్డుకుంటున్నారు. అరెస్టులు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. 
 
మరోవైపు, వ్యాక్సిన్ల విషయంలో కూడా రాజకీయాలకు పాల్పడుతున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు మాత్రమే అన్నట్లు దొడ్డిదారిన వ్యాక్సిన్లు వేయడం సరికాదు. ప్రజల ప్రాణాల విషయంలో కూడా ఇలాంటి రాజకీయాలా.? అమ్మపెట్టదు.. అడుక్కు తిన నివ్వదు అన్నట్లు ప్రభుత్వ వ్యవహరించడం సరికాదు. 
45పైబడిన వారికి వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. 18-45 ఏళ్ల మధ్యవారికి రాష్ట్రం కొనగోలు చేసుకోవాలని కేంద్రం సూచిస్తే.. చేయమంటే పట్టించుకోవడంలేదు. ప్రైవేట్ సంస్థలు వ్యాక్సిన్ కొనుగోలు చేసుకుంటామంటే అడ్డుకుంటోంది. 
 
ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వ్యాక్సిన్లు కొనుగోలు చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలు అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి తాడేపల్లిలో ఫిడేల్ వాయిస్తున్నాడు. రాష్ట్రం శ్మశానం అవుతుంటే.. పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా.? రూ.1600 కోట్లు ప్రభుత్వానికి లెక్కేమీ కాదు. కానీ.. కులం, మతం, ప్రాంతం అంటూ లెక్కలేసుకుంటే ఇబ్బంది పడతాం. 
ఆనందయ్య మందు ప్రమాదకరం కాదని ఆయుష్ తేల్చాక కూడాఎందుకు రాద్దాంతం చేస్తున్నారు.? ఆనందయ్యను పోలీసుల కస్టడీలో రోజుకో ప్రాంతానికి ఎందుకు తరలిస్తున్నారు.? వైసీపీ నేతల ఆధ్వర్యంలో రహస్యంగా మందు తయారు చేయించి ఇతర ప్రాంతాల్లో అమ్ముకోవడానికి సిగ్గులేదా.? 
 
ప్రజాహితం కోసం ఉచితంగా మందు ఇచ్చే వ్యక్తిని ఇబ్బంది ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం ఎంత మాత్రమూ సహేతుకం కాదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఉన్నాడా.? కరోనాతో ప్రజలు అవస్థలు పడుతుంటే ఎందుకు బయటకు రావడం లేదు.? కరోనాకు ముందు.. కరోనా తర్వాత అనే పరిస్థితి నెలకొంది. అందువలన ప్రజలంతా కరోనాను ఎదుర్కొనేందుకు తమ వంతుగా సహకారం అందించాలి. విధిగా మాస్కులు ధరించి, శానిటైజర్ వినియోగిస్తూ బాధ్యతగా మసలుకోవాలి. అప్పుడే సమాజాన్ని కాపాడుకన్నవాళ్లం అవుతామన్నారు.