శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 మే 2020 (21:11 IST)

ఆ తాగుబోతులంతా టీడీపీ కార్యకర్తలే... మంత్రి పేర్ని నాని

లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో పాటు... మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఇది మద్యం బాబులకు పండగ తెచ్చింది. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తాగుబోతులు మద్యం దుకాణాలకు క్యూకట్టారు. ఫలితంగా అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలకు తూట్లు పొడిచారు. దీనిపై  సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలకు ఏపి మంత్రి పేర్ని నాని వక్రభాష్యం చెప్పారు. తాగుబోతులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే డబ్బులిచ్చి మద్యం దుకాణాలకు పంపుతున్నారంటూ ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఏపీలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లిక్కర్ షాపులకు ప్రధాన నరేంద్ర మోడీ మినహాయింపులను ఇచ్చారని... దీన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. 
 
ముఖ్యంగా, ప్రజలను అయోమయానికి గురి చేసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని... ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలకు వంద రూపాయలు ఇచ్చి వైన్ షాపుల వద్ద క్యూలైన్లలోకి పంపుతున్నారని, మాస్కులు పెట్టుకోవద్దని వారికి చెపుతున్నారని... ఆ తర్వాత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. దీనికి ఎల్లో మీడియా వంతపాట పాడుతోందని ఆరోపించారు. 
 
బ్రాందీ షాపులను తీయమని చెప్పింది మోడీ అయితే, ముఖ్యమంత్రి జగన్‌ను చంద్రబాబు విమర్శిస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. ఎన్నికల ముందు మోడీని చంద్రబాబు చెప్పరాని మాటలతో తిట్టారని... ఇప్పుడు జైల్లో వేస్తారనే భయంతో ప్రేమ సందేశాలను పంపిస్తున్నారని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.