శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జులై 2020 (09:44 IST)

#YSRForever జననేత 71వ జయంతి : వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు

దివంగత మాజీ ముఖ‍్యమంత్రి, జననేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌కు ఆయన కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. ఇందులో, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు.. వైఎస్ఆర్ భార్య వైఎస్ విజలక్ష్మి, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
 
ఇడుపులపాయలో నిర్వహిస్తున్న వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొనడంతో ప్రభుత్వ యంత్రాంగం అడుగడుగునా ప్రత్యేక చర్యలు చేపట్టింది. అక్కడ పకడ్బందీగా కోవిడ్ ప్రోటోకాల్ పాటించింది. ఎమ్మెల్యేలను సైతం థర్మల్ స్కానింగ్‌ చేసిన తర్వాత జయంతి కార్యక్రమానికి అనుమతించారు. ఇప్పటికే కార్యక్రమానికి హాజరైన మీడియా సిబ్బంది, ఎమ్మెల్యేలకు కలెక్టర్ హరికిరణ్ కోవిడ్ పరీక్షలు చేయించారు.
 
నాలో.. నాతో వైఎస్ఆర్... 
కాగా, వైఎస్సార్‌కు నివాళి అనంతరం "నాలో.. నాతో వైఎస్సార్‌" పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని వైఎస్‌ విజయమ్మ రచించారు. వైఎస్సార్‌ స్వర్గస్థులైన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం "నాలో.. నాతో వైఎస్సార్‌". వైఎస్సార్‌ సహధర్మచారిణిగా వైఎస్‌ విజయమ్మ జీవితసారమే ఈ పుస్తకం.
 
వీటితోపాటు ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ట్రిపుల్ ఐటీ వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా, వైఎస్సార్‌ జయంతిని రాష్ట్ర రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.