1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 5 మే 2020 (20:57 IST)

ప్రభుత్వ పాఠశాలల్లో త్వరితగతిన పనులు పూర్తి : మంత్రి ఆదిమూలపు సురేష్

మనబడి నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 9 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనుల పురోగతిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరా తీశారు. 

సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంగ‌ళ‌వారం మంత్రి ఆదిమూలపు సురేష్  ఏపీఈడబ్ల్యూఐడీసీ పనులపై సంబంధిత ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ మేరకు  పాఠశాల  నిర్మాణం, అదనపు గదుల ఏర్పాటు, ప్రహారీ గోడలు,  రన్నింగ్‌ వాటర్‌తో కూడిన టాయ్‌లెట్లు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్ల ఏర్పాటు, రక్షిత తాగునీటి సరఫరా, విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ఫర్నిచర్‌, పాఠశాలలకు పెయింటింగ్స్‌, చిన్న, పెద్ద మరమ్మతులు, గ్రీన్‌ బోర్డులు, ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు తదితర పనులు ఎంత మేర జరిగాయన్న అంశంపై మంత్రి వివరాలు కనుక్కున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సంబంధించిన పనులకు ఎంతమేర నిధులు ఖర్చు అయ్యాయి, ఇంకా ఏమైనా బడ్జెట్ అవసరముందా అని ఇంజినీర్లను అడిగారు. నాణ్యత విషయంలో రాజీపడవద్దని సూచించారు. ఈ సందర్భంగా పనుల్లో తలెత్తుతున్న ఇబ్బందులపై మంత్రి ఆరా తీశారు.

సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందిగా మంత్రి కోరారు. ఆర్ఎంఎస్ఏ పనులపై కూడా మంత్రి చర్చించారు.

వీసీలో ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఈడబ్లూఐడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ, చీఫ్ ఇంజినీర్ నాగరాజు, ఎస్ఈ విజయ్‌కుమార్ ఆయా జిల్లాల ఎస్ఈ, ఈఈ, డీఈలు పాల్గొన్నారు.