శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (19:10 IST)

త్వరలోనే అమరావతి ప్రాంతంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం: బాలకృష్ణ

హిందుపురం శాసనసభ్యులు, నందమూరి వంశాకురం, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ గా క్యాన్సర్ భాదితులకు అండగా నిలుస్తున్న నందమూరి బాలకృష్ణ జన్మ దినోత్సవ వేడుకలు నేడు హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆవరణలో క్యాన్సర్ పై పోరాడుతున్న పలువురు రోగులు, అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి.
 
ఈ సందర్భంగా హాస్పిటల్ కు చేరుకొన్న బాలకృష్ణకు అభిమానులు, హాస్పిటల్ సిబ్బంది స్వాగతం పలికారు. ముందుగా హాస్పిటల్ ఆవరణలో ఉన్న స్వర్గీయ నందమూరి బసవతారక రామారావు గార్ల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం క్యాన్సర్ తో పోరాడుతున్న రోగులకు పండ్లు, చిన్నారులకు బహుమతులు, మిఠాయిలు పంపిణీ చేశారు. 
 
ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను బాలకృష్ణ ప్రత్యేకంగా అడిగి తెలుసుకోవడమే కాకుండా తన దృష్టికి తెచ్చిన సమస్యను పరిష్కరించాలని సిబ్బందికి సూచనలు చేశారు.  తర్వాత హాస్పిటల్ లో పని చేస్తున్న హౌస్ కీపింగ్ , సెక్యూరిటీ సిబ్బందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
 
 అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తన తండ్రి ఏర్పాటు చేసిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఎందరో క్యాన్సర్ రోగులకు చుక్కానిగా నిలిచిందని అన్నారు.  త్వరలోనే ఆంద్ర ప్రదేశ్ లోని అమరావతి ప్రాంతంలో హాస్పిటల్ నిర్మాణం ప్రారంభం కానుందని వెల్లడించారు.
 
 
హాస్పిటల్ స్థాపన సమయంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు నిర్థేశించిన లక్ష్యాలకు అనుగుణంగా దేశం లోనే అత్యున్నత శ్రేణి క్యాన్సర్ హాస్పిటల్ గా నిలబెట్టడానికి కృషి చేస్తామని చెప్పారు.  
 
ఈ సందర్భంగా హాస్పిటల్ స్థాపనలోనూ, నిర్వహణలోనూ సహాయం అందిస్తున్న పలువురు దాతలకు అందులోనూ ముఖ్యంగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 

పుట్టిన రోజు తనపై అభిమానులు, ఇతరులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు వయస్సు పెరిగినా నానాటికీ తగ్గిపోతున్న భావన ఏర్పడుతుందని బాలకృష్ణ అన్నారు.
 
ఇక కరోనా మహమ్మారితో జరుగుతున్న పోరాటానికి వ్యాక్సిన్ వేయించుకోవడం కీలకమని అంటూ తాను ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకొన్నానని, అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు.  వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటూ కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.
 
అనంతరం పలువురు దాతలు క్యాన్సర్ హాస్పిటల్ కు అందజేసిన పలు విరాళాలాలను బాలకృష్ణ వద్ద నుంచి స్వీకరించారు. ఇలా విరాళాలు ఇచ్చిన వారిలో సీతారామ రాజు లక్షరూపాయలు, అబ్బూరి శేఖర్ లక్ష రూపాయలు, బాలకృష్ణ అభిమానులు నిర్వహించే మన బాలయ్య.కామ్ తరపున సేకరించిన 2,22,222 రూపాయలు ఉన్నారు.  
 
వీరితో పాటూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రోగులకు అందించే ఉచిత భోజన సదుపాయం కోసం రుద్రరాజు రామరాజు గారు మరియు వారి కుటుంభ సభ్యులు 14.40 లక్షల రూపాయాల విరాళాన్ని అందజేశారు. 
 
వీరితో పాటూ విశాఖ జిల్లా నర్సీపట్నం కు చెందిన స్టార్ ఫౌండేషన్ కు చెందిన రాదాకృష్ణ గారు మూడు ఆక్సిజన్ కాన్సేంటేటర్స్ ను హాస్పిటల్ కు బాలకృష్ణ చేతుల మీదుగా అందజేశారు.