శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (07:45 IST)

నిర్ణీత వ్య‌వ‌ధిలోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: జగన్‌

పేదలందరికీ ఇళ్లు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లాల్లో ప్రత్యేకంగా నియమించిన జేసీలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్‌ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇళ్ల నిర్మాణాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.

నిర్ణీత సమయాల్లోగా ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన వారికి కచ్చితంగా అనుకున్న సమయంలోగా పట్టా ఇవ్వాలన్నారు. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా వారికి ఇంటి పట్టాలు అందాలన్నారు. శాచ్యురేషన్‌ పద్ధతిలో వారికి ఇంటి పట్టాలు అందించాలని సీఎం ఆదేశించారు.

‘‘మీరు అంతా యువత, మంతి ప్రతిభ ఉన్నవారు. మనం ఇప్పుడు కడుతున్న సంఖ్యలో గతంలో ఎప్పుడూ కట్టలేదు. దేశంలో కూడా గతంలో ఎన్నడూ ఇలా చేయలేదు. 28 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నాం. 17వేల లే అవుట్స్‌లో ఈ ఇళ్లను నిర్మిస్తున్నాం. అధికారులంతా అందరికీ ఇళ్లు పథకం అమలుకోసం విశేషంగా పనిచేస్తున్నారు.

నిర్ణీత సమయాల్లోగా ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలి. అంతేకాదు అర్హులైన వారికి కచ్చితంగా అనుకున్న సమయంలోగా పట్టా ఇవ్వాలి. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా వారికి ఇంటి పట్టాలు అందాలి. శాచ్యురేషన్‌ పద్ధతిలో వారికి ఇంటి పట్టాలు అందించాలి.

అర్హులు 100 మంది ఉంటే.. 10 మంది ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల సహకారంతో అర్హులైనవారికి సామాజిక తనిఖీచేసి శాచ్యురేషన్‌ పద్ధతిలో ఇవ్వగలుగుతున్నాం. పెన్షన్లు, ఇంటిపట్టాలు, రేషన్‌కార్డులు, ఆరోగ్య శ్రీ... రెగ్యులర్‌ గా సామాన్య జనంతో లింకైన అంశాలు ఇవి.

నిర్ణీత సమయంలోగా వీటికి సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించి వారికి ప్రయోజనాలు అందించాలి. ఎవరైనా మిగిలిపోతే, వారికి 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు వారికి అందాలి. ఇలా ఇళ్లపట్టాలు అందుకున్నవారికి ఇళ్లుకూడా ఇవ్వాలి. అందుకనే ప్రతి ఏటా కూడా ఇలా పట్టాలు అందుకున్నవారికి ఇళ్లు కట్టించాల్సిన అవసరం ఉంటుంది.

పేదవాడి సొంతింటికలను నిజంచేసే దిశగా అడుగులు వేస్తున్నాం. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇవ్వడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఇళ్లనిర్మాణం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలు ఎట్టి పరిస్థితుల్లోనూ మురికివాడలుగా మారొద్దు.

అక్కడ మంచి మౌలిక సదుపాయాలను కల్పించాలి. వివిధ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుని ఈ మౌలిక సదుపాయాలను కల్పించాలి. కాలనీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు కూడా అత్యంత ప్రాధాన్యతా అంశం. ఇళ్లస్థలాల రూపేణా, నిర్మాణం రూపేణా, మౌలిక సదుపాయాల రూపేణా సుమారు రూ.84వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. మౌలిక సదుపాయాలకే సుమారు రూ.34వేల కోట్లు ఖర్చు అవుతుంది.

ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదు. ప్రతి పనిలో కూడా పారదర్శకతను, నాణ్యతను దృష్టిలో ఉంచుకోండి. నాణ్యత విషయలో రాజీ పడితే... ఇబ్బందులు వస్తాయి. నిర్దేశించుకున్న సమయంలోగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలి. సమర్థవంతమైన ప్రణాళికతో ముందుకుసాగాలి. పనిలో డూప్లికేషన్‌ ఉండకూడదని’’ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.