గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 24 ఏప్రియల్ 2021 (11:09 IST)

ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా కేసులు, కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం వైఫల్యం: అచ్చెన్న

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో కరోనా తీవ్రరూపం దాల్చింది. సెకండ్ వేవ్‌లో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కేసులు 10 లక్షలు దాటేశాయి అచ్చెన్నాయుడు అన్నారు.

రోజువారీ కేసులు 11,000కు పైగా నమోదవుతున్నాయి. 60 వేలకు పైగా యాక్టివ్ కేసుల నమోదు ఆందోళన కలిగిస్తోంది. కరోనా విలయతాండవంపై ప్రపంచమంతా పోరాడుతుంటే జగన్ రెడ్డి మాత్రం తన రాజకీయ ప్రత్యర్థులపై పోరులో బిజీబిజీగా గడుపుతున్నారు. విపత్కర పరిస్థితులో ప్రజలకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ రాక్షసానందం పొందుతున్నారు.

భౌతిక దూరం, తప్పనిసరి మాస్కు నిబంధనలు రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదు. టెస్ట్, ట్రీట్, ట్రేస్ విధానాన్ని చిత్తశుద్దిగా నిర్వహించడం లేదు. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా కేసుల నమోదులో దేశంలోనే ఏపీ 5వ స్థానంలో నిలిచింది. రోజువారీ పాజిటివిటీ రేటు దక్షణభారతదేశంలో మన రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పరీక్ష మొదలు చికిత్స వరకూ బాధితులు పడిగాపులు పడుతున్నారు.

సెకండ్ వేవ్ ఉధృతి పెరిగాక ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఒక్క కొవిడ్ ఆస్పత్రిని కానీ, క్వారంటైన్ కేంద్రాన్ని కానీ సందర్శించలేదు. తూతూమంత్రంగా సమీక్షలు చేసేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్లే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని తమ చేతకానితనాన్ని ప్రజలపై నెట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం.

ఆస్పత్రుల్లో సకాలంలో బెడ్లు దొరక్క రోగులు ప్రాణాలొదుతున్నారు. ప్రభుత్వం చెప్పినంత ఆక్సిజన నిల్వలు లేవు. డిమాండ్ కు సరిపడా సప్లై లేక ప్రాణవాయువు కోసం పోరాడుతున్నారు. కొవిడ్ ఆస్పత్రులను పునరుద్ధరించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. క్వారంటైన్ కేంద్రాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాలేదు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చినా ఏ ఒక్క నెట్ వర్క్ ఆస్పత్రిలోనూ ట్రీట్ మెంట్ జరగడంలేదు.

కరోనా మొదటి దశలో ప్రభుత్వ అలసత్వం కారణంగా వందలాదిమంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. సెకండ్ వేవ్ లోనూ అదే నిర్లక్ష్య ధోరణిలో ముఖ్యమంత్రి ఉన్నారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం అలసత్వం వీడి వైరస్ ఉధృతి కట్టడిపై దృష్టి పెట్టాలి. రోజువారీ కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలి అని అన్నారు.