శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:16 IST)

3లక్షలు దాటిన కొత్త కేసులు... 2,104 మంది మృత్యుఒడికి

కరోనా వైరస్ భారత్‌ను చుట్టుముట్టి, ఊపిరాడనివ్వడం లేదు. మునుపెన్నడూ లేనంత ఉద్ధృతితో ప్రభుత్వాలు, ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక రోజులో మూడు లక్షలకు పైగా కేసులు, రెండు వేలకు పైగా మరణాలతో దేశంలో మహమ్మారి బుసలు కొడుతోంది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది.
 
గడిచిన 24 గంటల్లో 16,51,711మంది నమూనాలను పరీక్షించగా.. 3,14,835 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దేశంలోకి మహమ్మారి ప్రవేశించి తరవాత ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూశాయి. వరసగా రెండో రోజు 2వేలకు పైగా మరణాలు సంభవించాయి.

తాజాగా 2,104 మంది కరోనాతో మృత్యుఒడికి చేరుకున్నారు. దేశంలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. దాంతో మొత్తం కేసులు 1,59,30,965కి చేరగా..1,84,657 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకానొక దశలో అగ్రదేశం అమెరికాలో మాత్రమే మూడులక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. ఆ తరవాత ఆ స్థాయి విజృంభణ భారత్‌లోనే కనిపిస్తుండటం భయాందోళనకు గురిచేస్తోంది.
 
అలాగే వైరస్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 22లక్షలకు పైబడగా.. ఆ రేటు 13.82 శాతానికి పెరిగింది. ఇక నిన్న ఒక్కరోజే 1,78,841 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దాంతో కోటీ 34లక్షల మంది వైరస్‌ను జయించగా..రికవరీ రేటు 85.01 శాతానికి పడిపోయి కలవరపెడుతోంది. మరోవైపు, నిన్న 22,11,334 మందికి కేంద్రం టీకాలు పంపిణీ చేసింది. మొత్తంగా 13.23 కోట్ల మంది టీకా తీసుకున్నారు.