1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (11:46 IST)

సిక్కోలులో రెడ్ జోన్ పరిధిలోకి ఐదు మండలాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడని జిల్లాలుగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఉండేవి. కానీ, శనివారం శ్రీకాకుళంలోకి ఈ వైరస్ ప్రవేశించింది. ఢిల్లీ నుంచి ఓ వ్యక్తి.. అత్తారింటికి - సొంతూరుకు రహస్యంగా చక్కర్లు కొట్టాడు. దీంతో సొంతింటిలోని వారికి ముగ్గురికి ఈ వైరస్ సోకింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే ఐదు మండలాలను రెడ్ జోన్ పరిధిలోకి తెచ్చాయి. 
 
ఢిల్లీ నుంచి శ్రీకాకుళంలోని అత్తగారింటికి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా, నెగెటివ్ అని వచ్చింది. అయినప్పటికీ 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశించారు. అయితే, ఈ వ్యక్తి రహస్యంగా అత్తారింటి నుంచి సొంతూరికి వెళ్లివచ్చాడు. దీంతో సొంత కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి ఈ వైరస్ పాజిటివ్ అని తేలింది. అలాగే, ఈ వ్యక్తి కాంటాక్ట్ అయిన ఇతర వ్యక్తుల వివరాలను కూడా సేకరించే పనిలో అధికారులు నిమగ్నమైవున్నారు. ఈ వ్యక్తి ఏకంగా 300 మందిని కలిసినట్టు సమాచారం. 
 
మరోవైపు పాతపట్నం మండలంలో 18 గ్రామాలను కంటైన్మెంట్‌గా ప్రకటించి.. లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేస్తోంది. ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి వచ్చినవారంతా ఇళ్లకే పరిమితమవ్వాలని.. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని కలెక్టర్‌ నివాస్‌ హెచ్చరికలు జారీచేశారు. 
 
అధికారులు ఇప్పటికే పాతపట్నం మండలంలో 18 గ్రామాలను కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన కలిసిన వ్యక్తులందరినీ అధికారులు గుర్తించి.. క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఈ నెల 23న ఏడుగురిని, 24న 22 మందిని కరోనా నిర్ధారణ పరీక్షల కోసం జిల్లా కొవిడ్‌ ఆసుపత్రికి తరలించారు. మొత్తంమీద ప్రశాంతంగా ఉండే సిక్కోలు ప్రాంతంలో ఇపుడు కరోనా అలజడి చెలరేగింది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు.