1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 22 డిశెంబరు 2021 (16:01 IST)

ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు తక్షణం రాజీనామా చేయాలి

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం అన్యాయం చేస్తోంద‌ని,  తక్షణం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య డిమాండ్ చేశారు. రాజ‌మండ్రి సిపిఐ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా సాధించే వరకూ పోరాటాన్ని ఆపేది లేదని అన్నారు. గతంలో ప్రతిపక్ష నేత గా ఉన్న జగన్ 25 ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా సాదిస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక హామీలు గాలికి వదిలేశారు అన్నారు. మోడీ నాటకాలకు జగన్ వంత పాడుతున్నారని, చిత్తశుద్ధి ఉంటే తమ ఎంపీలతో తక్షణం రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. 
 
 
అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఇప్పటి కైనా జగన్ ప్రకటించాలని, పోలవరం నిధులు సాధనకు అన్ని పార్టీల నేతలతో అఖిల పక్షం ఏర్పాటు చేయాలని కోరారు. మద్యం ధరలు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం  పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసరధరలను అదుపు చేయడానికి సెస్సులు తగ్గించాలని డిమాండ్ చేశారు. 
 
 
సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ఈనెల 26 న సీపీఐ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపు ఇచ్చారు. జనవరి 4,5,6 తేదీలలో మహిళా సమాఖ్య వర్క్ షాప్ కు మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తారని వెల్లడించారు. సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, జట్లు లేబర్ యూనియన్  అధ్యక్షులు కూండ్రపు రాంబాబు, నల్లా భ్రమరాంబ, బొమ్మసాని  రవిచంద్ర, రమ‌ణ‌మ్మ తదితరులు పాల్గొన్నారు.