1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 అక్టోబరు 2023 (12:21 IST)

వైకాపాను ఓడించాలన్న పవన్‌తో ఏకీభవిస్తున్నాం.. కానీ : సీపీఐ నేత రామకృష్ణ

cpi ramakrishna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి వైకాపా నుంచి తరిమి కొట్టాలన్న జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తాము ఏకీభవిస్తున్నామని, అయితే, వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి వస్తుందంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలను ఏమాత్రం సహేతుకంగా లేవని సీపీఐ రాష్ట్ర నేత రామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైకాపా ఏ మేరకు నష్టం చేకూర్చిందో.. అంతకంటే ఎక్కువగా బీజేపీ హాని చేసిందని ఆయన అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కృష్ణా జలాల పునఃపంపిణీ నిర్ణయంతో ఏపీకి అన్యాయం జరుగుతుందని, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోడీకి లేఖ రాయడం తప్ప ఏం చేయలేదని, చేయలేరని అన్నారు. రాష్ట్ర ప్రయోజనలా కంటే జగన్‌కు తన వ్యక్తి గత ప్రయోజనాలకో పెద్దపీట వేసి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. 
 
విశాఖ ఉక్కు ఉత్పత్తి తగ్గిస్తూ దాని మనుగడ కోల్పోయేలా చేస్తున్నా చూస్తూ ఉండిపోయారన్నారు. ఏపీలో అన్ని రంగాలను నాశనం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయంపై తక్షణమే స్పందించి అన్ని సంఘాలు, పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
 
అలాగే, రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీని ఓడించాలని, ఇందుకు కలిసి వచ్చే పార్టీలతో రాబోయే ఎన్నికల్లో యుద్ధం చేస్తామన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నామన్నారు. అయితే, ఓ విషయంలో మాత్రం విభేదిస్తున్నామని, రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు సహకరిస్తోంది కేంద్రంలోని బీజేపీ అని జనసేనాని గ్రహించాలన్నారు. 
 
అమరావతి రాజధానిని నిలిపేసినా, ₹ లక్షల కోట్ల అప్పులు చేస్తున్నా వైసీపీకి బీజేపీ పూర్తిగా సహకరిస్తుందని, ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమన్నారు. లోకేశ్ ఇరవై రోజులకు పైగా ఢిల్లీలో ఉన్నా కనీసం రెండు నిమిషాలు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నారు. కానీ జగన్ గంటలపాటు భేటీ అవుతున్నారన్నారు.