శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (10:19 IST)

విశాఖలో క్రాస్ ఓటింగ్.. జనసేన అభ్యర్థి గెలుపు ఖాయమా?

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిదశ పోలింగ్ ముగిసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ పోలింగ్ కూడా ముగిసింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. ఫలితంగా దాదాపు 80 శాతానికిపైగా పోలింగ్ శాతం నమోదైనట్టు ఎన్నికల సంఘం వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
ఇదిలావుంటే, విశాఖ లోక్‌సభ స్థానం నుంచి ముగ్గురు హేమాహెమీలు పోటీ చేస్తున్నారు. వీరిలో టీడీపీ తరపున సినీ హీరో బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ పోటీ చేశారు. బీజేపీ తరపున కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, జనసేన పార్టీ తరపున సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణతో పాటు వైకాపా అభ్యర్థి పోటీ చేస్తున్నారు. దీంతో చతుర్ముఖ పోటీ ఏర్పడింది. 
 
అయితే, విశాఖపట్నం లోక్‌సభ స్థానానికి వస్తే క్రాస్‌ ఓటింగ్‌ బాగా జరిగినట్టు సమాచారం. టీడీపీ, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులకు ఓటు వేసిన అనేక మంది ఓటర్లు ఎంపీ స్థానానికి వచ్చేసరికి జనసేన అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణకు ఓట్లు వేసినట్టు చెబుతున్నారు. ఇంచుమించు అన్ని నియోజకవర్గాల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది.
 
ఇకపోతే, పోలింగ్‌ ప్రక్రియ ముగియడంతో తెలుగుదేశం నేతలు పార్టీ గెలుచుకునే స్థానాలపై అంచనాలు వేసుకుంటున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చంద్రబాబు ఇమేజ్‌తో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 
మహిళా ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావడంతో టీడీపీకి సానుకూల ఓటింగ్‌ గణనీయంగా నమోదైందని అంచనా వేస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు అన్ని పోలింగ్‌ బూత్‌లలో పురుఫుల కంటే మహిళా ఓటర్లు అధికంగా కనిపించారు.