1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

వారెవ్వా.... వాలంటీర్లకు బంపర్ ఆఫర్.. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నెలనెలా జీతమంతా ఇచ్చేస్తారట..

ysrcp flag
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అధికార వైకాపా తరపున పోటీ చేయనున్న శివప్రసాద్ రెడ్డి.. ఆ నియోజకవర్గంలోని వాలంటీర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రాధేయపడ్డారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే, తనకు నెలనెలా వచ్చే వేతనాన్ని వాలంటీర్లకే వెచ్చిస్తానంటూ తాయిలం ప్రకటించారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో గురువారం వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మతో పాటు ఆమె కుమారుడు, దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్, శివ ప్రసాద్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 
 
ఇందులో శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, "నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నెల నెల వచ్చే వేతనం అంతా వాలంటీర్లకే వెచ్చిస్తాను. బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాలంటీర్లకు ఉచిత బీమా సదుపాయం కల్పిస్తాను. ఆ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుంది. ఒక్కో వాలంటీర్ పరిధిలో 50 ఇళ్లు ఉన్నాయి. వాళ్లు వైకాపాకి ఓట్లు వేసేలా ప్రతి ఒక్క వాలంటీర్ కృషి చేయాలి" అని శివప్రసాద్ రెడ్డి ప్రాధేయపడ్డారు. ఆ తర్వాత జడ్పీ చైర్మన్ వెంకాయమ్మ మాట్లాడుతూ, ఇపుడు మన రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల కంటే వార్డు వాలంటీర్లకే గౌరవమర్యాదలతో పాటు విలువ ఉందని చెప్పడం గమనార్హం. 
 
మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామం... ఆ ముగ్గురిని విందుకు ఇంటికి ఆహ్వానించి శరద్ పవార్ 
 
మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ చేసిన ఈ పనికి ప్రతి ఒక్కరూ నివ్వెర పోతున్నారు. తనపై తిరుగుబాటు జెండా ఎగురవేసి ఏకంగా నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీని సొంతం చేసుకున్న తన అన్న కుమారుడు, మహారాష్ట్ర మంత్రి అజిత్ పవార్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లను తన ఇంటికి శరద్ పవార్ విందుకు ఆహ్వానించారు. ఇటీవలే ఎన్సీపీ నుంచి బయటకు వెళ్లి.. నిజమైన ఎన్సీపీ పార్టీ తనదేనంటూ ఎన్నికల సంఘం ఎదుట నిరూపించుకున్న అజిత్ పవార్‌ను ఆయన విందుకు ఆహ్వానించడంతో శరద్ పవార్ అనుచరులు, ఆయన వెన్నంటి ఉండే కార్యకర్తలు నివ్వెరపోతున్నారు. 
 
కాగా, ముఖ్యమంత్రి షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్‌లు కలిసి మహారాష్ట్రలోని బారామతిలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభోత్సవానికి శనివారం వస్తున్నారు. బారామతి శరద్ పవార్ సొంత పట్టణం. దీంతో ఆయన స్పందించారు. "రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బారామతికి వస్తున్నారు. బారామతిలో ఆయన నమో మహా రోజ్‌గార్ పథకం ప్రారంభిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమం ముగిశాక ఆయన తన మంత్రివర్గ సహచరులతో కలిసి మా ఇంట్లో భోజనానికి రావాలని ఆహ్వానించాను" అని శరద్ పవార్ పేర్కొన్నారు. 
 
కాగా, దేశంలో ఇది సార్వత్రిక ఎన్నికల సమయం. ఈ ఎన్నికల్లో అజిత్ పవార్ సతీమణి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో విందు రాజకీయానికి అధిక ప్రాధాన్యత నెలకొంది.