శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (18:58 IST)

'బాహుబలి' కలెక్షన్లపై విచారణ జరుపుతాం : సజ్జల

ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా కలెక్షన్లపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సినిమా టికెట్ల కలెక్షన్‌ విషయంలో సినిమా విడుదలైన తొలివారంలో సగం డబ్బు ప్రభుత్వానికి.. డిస్ట్రిబ్యూటర్లకూ వెళ్లలేదని తెలిసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 
 
బాహుబలి విడుదలైన తొలి వారంలో థియేటర్లలో సగం సీట్లు ఖాళీగా ఉన్నట్లు చూపినట్టు తెలిసిందన్నారు. ఈ లెక్కన ఎంత మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు పన్ను రాలేదో తేల్చాల్సి ఉందన్నారు. ఈ వ్యవహారంపై నిజం నిగ్గుతేలేలా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, గతంలో ఎన్టీఆర్‌ నుంచి రాజబాబు వరకు ఎవరి సినిమాలైనా గతంలో టికెట్‌ ధరలు ఒకేలా ఉండేవని.. సినిమా బాగుంటే ఎక్కువ రోజులు ఆడేవన్నారు. కానీ ఇప్పుడు టిక్కెట్‌ ధరను రూ.500 వరకు పెంచేసి వారం రోజుల్లోనే పెట్టుబడులు రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలుగు సీనీ పరిశ్రమకు పవన్‌ కల్యాణ్‌ పెద్ద గుదిబండగా మారారని సజ్జల విమర్శించారు. 
 
ప్రభుత్వ తీసుకువచ్చిన విధానం వల్ల ఎన్టీఆర్‌ సినిమా అయినా.. కాంతారావు సినిమా అయినా టికెట్‌ ధర ఒకేలా ఉంటుందని అన్నారు. ప్రేక్షకుడికి సరసమైన ధరకు వినోదం లభిస్తుందంటే పవన్‌ ఎందుకు వద్దంటున్నారో చెప్పాలన్నారు. సినిమా టికెట్ల వల్ల బహుశా రూ.200 కోట్లు వస్తాయేమోనని.. దాంతో ప్రభుత్వం ఎంత అప్పు తీసుకుంటుందని, ఈ విషయాన్ని కూడా పవన్‌ చెబితే.. బాగుంటుందని సజ్జల వ్యాఖ్యానించారు.