1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 10 జనవరి 2022 (21:20 IST)

సినిమా తీసినోడే, టిక్కెట్ ధ‌ర నిర్ణ‌యించాలి... ఆర్జీవీ

టికెట్ రేట్ల తగ్గింపు సినిమా రంగానికి తీవ్ర నష్టం క‌లిగించింద‌ని రాంగోపాల్ వర్మ అన్నారు. సినిమా టికెట్  ధరల తగ్గింపు వల్ల సినిమా రంగం తీవ్రంగా దెబ్బ తింటోందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పేర్ని నానితో చర్చలు సంతృప్తికరంగా ముగిశాయని అన్నారు. 
 
 
ఐదు ముఖ్యమైన అంశాలపై చర్చించామని, ప్రధానంగా టికెట్ల రేట్ల త‌గ్గింపును ముందుగా ప్రస్తావించానని చెప్పుకొచ్చారు. థియేటర్ల మూసివేతపై ఎలాంటి చర్చా జరగలేదని స్పష్టం చేశారు. ధరల       కేటాయింపుపై ఎవరికీ అధికారం ఉండకూడదని అన్నారు. మంత్రి పేర్నినానితో జరిగిన భేటీలో ఐదు అంశాలపై ప్రధానంగా చర్చించామ‌ని, టికెట్ రేట్లు తగ్గించడాన్నివ్యతిరేకించామ‌ని చెప్పారు. సినీ రంగంతో త‌న‌కున్న 30 ఏళ్ల అనుభవంతో ఎక్కడ ఏం జరుగుతుందన్నవిషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చామ‌న్నారు. 
 
 
మంత్రి పేర్ని నాని కూడా కొన్ని విషయాలను త‌న దృష్టికి తీసుకొచ్చార‌ని, వాటిని సినీ రంగానికి చెందిన వారిని కలిసి చర్చిస్తామ‌న్నారు. ఇదొక పద్ధతి ప్రకారం చేస్తాం, అందరికీ ఒక పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నామ‌న్నారు. టికెట్ రేట్లు తగ్గిస్తే, ఇండస్ట్రీకి చాలా నష్టం వస్తుందని ఆయనకు వివరించామ‌న్నారు. 
 
సినీ నిర్మాతగా నా అభిప్రాయం చెప్పా. నా వాదన వినిపించేందుకు మాత్రమే ఇక్కడకు వచ్చా. నేను ఎలాంటి డిమాండ్లు ఆయన ఎదుట పెట్టలేదు. ఈ భేటీ ద్వారా వచ్చిన అభిప్రాయాలపై ఇద్దరం చర్చిస్తాం. తుది నిర్ణయం అనేది ప్రభుత్వం తీసుకుంటుంది.” “రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను తగ్గించిందనే వాదనతో నేను ఏకీభవించను. అయితే, ప్రభుత్వం నిర్ణయం స్టార్లందరి పైనా, అన్ని సినిమాలపైనా ప్రభావం చూపుతోంది. కేవలం పవన్ కల్యాణ్, బాలకృష్ణను టార్గెట్ చేయడానికి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు. టికెట్ రేట్ల తగ్గింపు విషయంలో నేను అడిగిన ప్రశ్నలకు విపులంగా ఉదాహరణలు చెప్పి అన్నీ వివరించా. 
 
 
కేవలం ఈ ఒక్క చర్చతోనే టికెట్ రేట్ల తగ్గింపు అంశం ముగిసిపోదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే నేను ఒక్కడినే కాదు. వందల మంది ఉన్నారు. వాళ్లందరి అభిప్రాయాలను
కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. నేను సినిమా ఇండస్ట్రీ తరపున రాలేదు. ఒక సినిమా నిర్మాత మాత్రమే ఇక్కడ చర్చించడానికి వచ్చా. ఎవరైతే సినిమా తీశారో వాళ్లే టికెట్ రేటు నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలి. పరిష్కారం అనేది సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వం ఇద్దరి పైనా ఉంది. తప్పుడు కలెక్షన్లు, పన్ను ఎగవేతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. తాజా చర్చలతో నూటికి నూరుశాతం సంతృప్తితో ఉన్నా” అని వర్మ చెప్పుకొచ్చారు.
 
 
దీనిపై మంత్రి పేర్ని  నాని మాట్లాడుతూ, 1956  సినిమాటోగ్రఫీ చట్టం ప్ర‌కారం సినిమా టికెట్ ధరలు నిర్దారించే అధికారం ప్రభుత్వానికి ఉంద‌ని, రాం గోపాల్ వర్మ  ఆయన  చెప్పాల్సింది  ఆయన చెప్పార‌ని అన్నారు. అన్నీవివరంగా  విన్నాను.... అన్ని  చట్ట ప్రకారమే  జరుగుతున్నాయి. ఇప్పటికే  సినిమా టికెట్  అంశానికి సంబంధించి ఒక  కమిటీ ఏర్పాటు  అయింది. ఆ  కమిటీ సూచనల ప్రకారం తదుపరి నిర్ణయాలు ఉంటాయి.. ఏదైనా చెప్పాలనుకుంటే కమిటీకి చెప్పొచ్చ‌ని తెలిపారు.