శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఆర్. సందీప్
Last Modified: బుధవారం, 20 మే 2020 (17:34 IST)

కుక్కలు మొరిగాయని వాటి యజమాని పళ్లూడగొట్టాడు

కుక్కలు మొరిగాయని యజమాని పళ్లూడగొట్టిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. తీవ్రగాయాలైన అతడిని తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేర్చారు. వివరాల్లోకి వెళితే చంద్రగిరి మండలం ఎ.రంగంపేట గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి మేకలు కాస్తుంటాడు. సాయంత్రం మేకలను మేపు నుండి తోలుకువచ్చి, ఇంటి బయట సేదతీరుతున్నాడు. 
 
ఇంతలో కొంతమంది వ్యక్తులు ఆ దారిలో వెళ్తుంటే అతని కాపలా కుక్కలు వారిని చూసి మొరిగాయి. వాళ్లు పట్టించుకోకుండా వెళ్లిపోయినా, ఇంటి ఎదురుగా నివసించే మల్లికార్జునాచారి, ఆయన భార్య సరిత, కొడుకు శ్రావణ్ కుక్కల అరుపులకు విసిగిపోయి రాళ్ల దాడికి దిగారు. కుక్కలపై రాళ్లు విసిరినందుకు కృష్ణయ్య కోప్పడటంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. 
 
గొడవ పెద్దదయి మల్లికార్జునాచారి, అతని కుటుంబ సభ్యులు కృష్ణయ్య మీద రాళ్లు విసరడం ప్రారంభించారు. అవి ముఖానికి తగిలి గాయాలయ్యాయి. కొన్ని పళ్లు కూడా రాలిపోయాయి. తీవ్రంగా గాయపడిన కృష్ణయ్యను అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించుకున్న తర్వాత బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో మల్లికార్జునాచారి, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.