1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (19:42 IST)

కరోనా పరీక్షలకు, కరోనా ఆసుపత్రిలో అడ్మిషన్ కొరకు 104 కాల్ సెంటర్లకు ఫోన్ చేయాలి: కృష్ణా జిల్లా కలెక్టర్

కృష్ణా జిల్లాలో చాలా మంది ప్రజలు ప్రైవేట్ లాబొరేటరీస్ ద్వారా, సిటి స్కానింగ్ మరియు ఆర్టిపిసిఆర్ పరీక్షలు చేయించుకొని నేరుగా గూడవల్లి కోవిడ్ కేర్ సెంటరుకు వస్తున్నారని, అలాంటి వారు మొట్టమొదట మీ సమీపములో ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ డాక్టర్లను సంప్రదించి వారి సలహమేరకు కోవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎక్కడ చికిత్స అందిస్తారో తెలుసుకుని అక్కడికి మాత్రమే వెళ్ళాలని జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.
 
ప్రభుత్వము ఏర్పాటు చేసిన కోవిడ్ పరీక్షలు మాత్రమే కచ్చితత్వము కలిగి ఉంటాయని, ప్రభుత్వ లెక్కలలోకి చేరతాయని, ప్రభుత్వము సదరు పేషెంట్ కు ఒక గుర్తింపు నెంబర్ కేటాయించుట ద్వారా మీ ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన సలహాలు, పర్యవేక్షణ, పరిరక్షణకు అవకాశము కలుగుతుందని కలెక్టర్ అన్నారు. 
 
గూడవల్లి కోవిడ్ కేర్ కేంద్రము ప్రభుత్వ అధ్వర్యములో పాజిటివ్ అని నిర్ధారణ అయి, ఆర్టిపిసిఆర్ పరీక్ష ద్వారా గుర్తింపు సంఖ్య కేటాయించబడి ఎటువంటి లక్షణములు లేని, తక్కువ లక్షణాలు కలిగి, ఇంట్లో ఎటువంటి ప్రత్యేక గదిలేని వారిని, ఇతర ప్రాంతానికి చెందిన వారిని ఈ కేంద్రంలో చేర్చుకుంటారని కలెక్టర్ అన్నారు. 
 
ఆరోగ్య పరిరక్షణ కోసం, తాత్కాలిక కేంద్రము మాత్రమే తప్ప హాస్పిటల్ కాదని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కలెక్టర్ అన్నారు. పాజిటివ్ నిర్ధారణ అయినవారు వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి హస్పిటల్ అడ్మిషన్ కొరకు 104 కాల్ సెంటర్ల్ను సంప్రదించాలని ఏ.యండి. ఇంతియాజ్ అన్నారు.