1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (09:29 IST)

హైదరాబాద్‌లో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం...

హైదరాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. అదీకూడా కరోనా వైరస్ లాక్‌డౌన్ అమల్లోవున్న పరిస్థితుల్లో కూడా అత్యాచార ఘటన ఒకటి జరిగింది. ఓ మానసిక వికలాంగురాలిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటన నగర శివారు ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన బాధిత బాలిక రోడామిస్త్రీనగర్‌లో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నది. దీన్ని అదే ప్రాంతానికి చెందిన యువకులు అక్బర్, జుమన్, గయాజ్, అలీంలు గమనించి, ఆమెను అనుచరించారు. 
 
ఆ తర్వాత తమ చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించి.. ఆ యువతిని పట్టుకుని కేకలు వేయకుండా నోటిని గుడ్డతో అదిమిపెట్టి, సమీపంలోని ఓ పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం అర్థరాత్రి దాటిన తర్వాత బాలికకు ఫోన్ ఇచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు.
 
దీంతో కంగారుపడిన వారు వెంటనే దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక నుంచి వచ్చిన ఫోన్‌కాల్ ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు రెండు గంటల తర్వాత దేవేందర్‌నగర్‌లో బాలికను గుర్తించారు. అప్పటికీ ఆమెతోనే ఉన్న నిందితులు పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. 
 
అతడిచ్చిన సమాచారంతో మిగతా ముగ్గురిని కూడా ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. వారిపై కిడ్నాప్, అత్యాచారం, తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.