శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2022 (09:43 IST)

కళాశాలకు వెళ్లి అదృశ్యమైన యువతి.. ఇసుక రీచ్ వద్ద శవమై కనిపించింది...

deadbody
కడప జిల్లాలో దారుణం జరిగింది. కళాశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని ఆదివారం ఉదయం శవమై కనిపించింది. జిల్లాలోని జంగాలపల్లె ఇసుక రీచ్ వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది. తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు సకాలంలో స్పందించలేదని మృతురాలి తల్లిదండ్రులు వాపోయారు. 
 
పోలీసుల కథనం మేరకు... జిల్లాలోని బి.కొండూరు మండలం, మరాటిపల్లెకు చెందిన అల్లంపాటి రామిరెడ్డి, రమాదేవిల రెండో కుమార్తె అనూష (19) బద్వేల్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది. 
 
ఈ నెల 20వ తేదీన కాలేజీకి వెళ్లిన ఆ యువతి రాత్రికి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో అనూష మృతదేహం ఇసుక రీచ్ ఉన్న అనుమానాస్పద స్థితిలో కనిపించింది. 
 
ఈ యువతిపై సామూహిత అత్యాచారం చేసి చంపి నదిలో విసిరేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ వాదనలను పోలీసులు తోసిపుచ్చుతున్నారు. ఆ యువతి అదృశ్యమైన రోజునే ఆత్మహత్య చేసుకుందని మైదుకూరు డీఎస్పీ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో చెప్పడం గమనార్హం. 
 
ఈ వ్యాఖ్యలను మృతురాలి తల్లిదండ్రులు కొట్టిపారేస్తున్నారు. తమ కుమార్తె కనిపించడం లేదని 20వ తేదీ రాత్రి బద్వేలు పట్టణ పోలీసుల దృష్టికి తీసుకెళ్తే అది తమ పరిధి కాదని వెనక్కి పంపించారని, దీంతో తాము బి కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేసి విషయం చెబితే బద్వేలులో అదృశ్యమైంది కాబట్టి అక్కడే ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. 
 
అప్పటికీ స్థానిక పోలీసులు తమ మాట వినకపోవడంతో వారు మైదుకూరు డీఎస్పీని ఆశ్రయించగా, అపుడు కేసు నమోదైంది. తమ కుమార్తె మృతికి పాపిరెడ్డిపల్లికి చెందిన గురుమహేశ్వర రెడ్డి అనే యువకుడిపై తమకు అనుమానం ఉందని పోలీసులకు చెప్పామని, వారు వెంటనే స్పందించివుంటే తమ కుమార్తె ప్రాణాలతో మిగిలివుండేదని తల్లిదండ్రులు బోరున విలపిస్తూ చెప్పారు.