మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 14 జనవరి 2021 (22:20 IST)

కన్నుల పండువగా గోదా కళ్యాణం

ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్బంగా గురువారం రాత్రి తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ఆవరణంలోని మైదానంలో  శ్రీ కృష్ణ శ్రీ గోదా దేవి కళ్యాణం  కన్నుల పండువగా జరిగింది. టీటీడీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొన్నారు.
       
ఈ సందర్బంగా డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్ గోదాదేవి ఆవిర్భావం, గోదా కళ్యాణం ప్రాశస్త్యం గురించి వివరించారు. 5 వేల సంవత్సరాల క్రితం జరిగిన శ్రీ గోదా కళ్యాణం శ్రీవారి దయతో నేడు భక్తులు మళ్ళీ చూడగలిగే భాగ్యం కలిగిందన్నారు.

ధనుర్మాసానికి వీడ్కోలు, మకర సంక్రాంతికి స్వాగతం పలుకుతూ  గోదా కల్యాణం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.శ్రీ గోదాదేవి శ్రీ వేం కటేశ్వర స్వామివారి మీద రోజుకో పాశురం కీర్తించి స్వామివారి సరసన నిలిచిన మహా భక్తురాలని చెప్పారు.

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శేషాచల కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు శ్రీకృష్ణ స్వామి, శ్రీ గోదా దేవి కళ్యాణం కోసం పుణ్యాహవచనం, విష్వక్సేన ఆరాధన,  అంకురార్పణ, కంకణ పూజ నిర్వహించారు. తొలుత సర్కారు సంకల్పం, అనంతరం భక్తులందరితో సంకల్పం చేయించారు.

ఆభరణాలు, పుష్పమాలలతో విశేషంగా అలంకరించిన శ్రీ గోదాదేవి శ్రీ కృష్ణ స్వామి వారికి కంకణాలు కట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం అనంతరం అర్చకులు శ్రీ గోదాదేవి రచించిన 10 పాశురాలను పఠిస్తూ,  వారణ మాయిరం క్రతువు నిర్వహించారు. చివరగా నివేదన, మంగళ హారతితో కళ్యాణ వేడుక ముగిసింది.
అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీవారిని వైభవాన్ని చాటుతూ కీర్తనలు ఆలపించారు. మైదానంలోని భక్తులు సామూహికంగా గోవింద నామాలు పఠించారు. రాత్రి 8.30 గంటలకు ఈ వేడుక ముగిసింది.
 
కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి దంపతులు, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఎంపీ  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి,  టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటి ఈవో హరీంద్ర నాథ్, శ్రీవారి ఆలయ ఓఎస్డీ పాల శేషాద్రి, విజఓ బాలిరెడ్డి  పాల్గొన్నారు.