శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2019 (18:20 IST)

విశాఖలో సీఎం జగన్‌కు ఘనస్వాగతం, కేపిటల్ సిటీ ఖాయమేనా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ప్రతిపాదన చేసిన అనంతరం తొలిసారిగా నగర పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌కు ఘనస్వాగతం లభించింది.

విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్‌లోని విశాఖ ఉత్సవ్‌ వేదిక వరకూ దాదాపు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం 3.50 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరిన సీఎం జగన్‌కు దారిపొడవునా కృతజ్ఞత పూర్వక స్వాగతం లభించింది. 

ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. కైలాసగిరి నుంచి సెంట్రల్‌పార్క్‌కు, సెంట్రల్‌ పార్క్‌ నుంచి ఆర్‌కేబీచ్‌కు ఇలా సీఎం వచ్చే దారిలో స్వాగత మానవ తోరణంతో  సీఎంకు థాంక్స్‌ చెప్పారు. కాన్వాయ్‌ వాహనంలో ముఖ్యమంత్రి  ఎడమవైపున ఉంటారు.

దీంతో రోడ్డుకు ఒకవైపున మాత్రమే నిలబడి ఆత్మీయ కృతజ్ఞతలు తెలియజేశారు. రాజధానిగా ప్రతిపాదించిన కొద్ది రోజుల్లోనే విశాఖ అభివృద్ధికి బీజం వేస్తూ  ఏకంగా రూ.1285.32 కోట్ల పనులు ఆయన చేతుల మీదుగా శ్రీకారం చుట్టుకోనున్నాయి.