1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2024 (08:57 IST)

కొడాలి నానిపై ఆగ్రహం... గుడివాలో నాని వాసనలు లేకుండా చేస్తున్న టీడీపీ కేడర్!!

kodali nani
మాజీ మంత్రి, వైకాపా నేత కొడాలి నానికి గుడివాడలోని టీడీపీ, జనసేన కార్యకర్తలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. అధికారమదంతో గత ఐదేళ్ళుగా అరాచకాలు సాగించిన కొడాలి నాని.. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తగిన శాస్తి చేశారు. చిత్తుగా ఓడించారు. టీడీపీ అభ్యర్థికి విజయం కట్టబెట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ముఖ్యంగా, కొడాలి నాని వల్ల గత ఐదేళ్లుగా తాము పడిన బాధలను ఇపుడు గుర్తు చేసుకుంటా వాటికి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అంతేకాకుండా గుడివాడలో కొడాలి నాని ఆనవాళ్లు ఒక్కటి కూడా లేకుండా చేస్తున్నారు. 
 
గత ఐదేళ్లుగా ఒక్క అభివృద్ధి పని చేయకపోగా, మున్సిపల్‌ నిధులతో నిర్మించిన రాజేంద్రనగర్‌ పార్కుకు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) పేరు ఉండడం ఏమిటని టీడీపీ నాయకులు గురువారం సాయంత్రం ఆ పేరును తొలగించారు. 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పని చేసిన కొడాలి నాని గుడివాడలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని టీడీపీ నేత కడియాల గణేష్‌ ప్రశ్నిస్తున్నారు. 
 
మరోవైపు రాజేంద్రనగర్‌ పార్కుకు కొడాలి నాని పేరు తొలగించడం తప్పుకాదని.. ప్రజలకు మంచి చేయని నేతల పేర్లు శిలాఫలకాలు, పార్కులపైనా ఉండాల్సిన అవసరం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. తొలుత పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపాన్ని ఆనుకొని నిర్మించిన చెత్తకుండీని ఆర్యవైశ్యులు ధ్వంసం చేశారు. ఆర్యవైశ్యులపైన కక్షతోనే నాని కావాలని కల్యాణ మండపాన్ని ఆనుకొని భారీగా చెత్తకుండీ నిర్మించారని.. ఇబ్బందికరంగా ఉన్న దీన్ని ధ్వంసం చేసినట్లు ఆ సంఘీయులు ప్రకటించారు.
 
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఆగ్రహంతో పలు గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ప్రారంభించిన పలు ప్రభుత్వ కార్యాలయాల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. దొండపాడు రైతు భరోసా కేంద్రంలోని రెండు, ఆరోగ్య కేంద్రంలో ఒకటి, జల్‌జీవన్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన రక్షిత మంచినీటి పథకం ట్యాంకు ప్రారంభ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. కొడాలి నాని పేరుతో ఉన్న ప్రతి శిలాఫలకాన్ని నాశనం చేశారు.