శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (09:39 IST)

విధులు నిర్వహించి వస్తుండగా విధి వక్రీకరించి...

విధి వక్రించడంతో విధుల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ప్రమాదంలో ఓ ప్రభుత్వ వైద్యురాలు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతూ చివరికి ఓడిపోయారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కాజాకు చెందిన డా. తనూజాభాయి(38) ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. తొలుత గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో విధులు నిర్వహించారు. 
 
గత మూడేళ్లుగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దంత వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ఒంగోలులో నివాసం ఉంటూ విధులకు హాజరవుతుంటారు. ఈ నెల 18న విధులు ముగించుకుని కారులో తిరిగి ఒంగోలు వస్తున్నారు. 
 
అదేసమయంలో తిరుపతి వెళ్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వైద్యురాలి వాహనాన్ని కనుమళ్ల జాతీయ రహదారి వద్ద వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఒంగోలులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. 
 
వైద్యం అందిస్తుండగానే నాలుగు రోజుల క్రితం డెంగీ బారిన పడ్డారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆదివారం రాత్రి హైదరాబాద్‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె సోమవారం రాత్రి మృతి చెందారు. 
 
తనూజాభాయి భర్త కిరణ్‌ కుమార్‌ నాయక్‌ కూడా వైద్యునిగా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. వైద్యురాలి మృతికి స్థానిక వైద్యాధికారులు, సిబ్బంది నివాళి అర్పించారు.