గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2024 (09:54 IST)

వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు జీవీఎంసీ షాక్...

vijayasaireddy
వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు నేహారెడ్డికి గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్ తేరుకోలేని షాక్ ఇచ్చింది. నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారు. భీమిలి బీచ్ వద్ద సీఆర్డ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రహరీ నిర్మాణాన్ని చేపట్టగా, దీనిపై మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. అలాగే, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు. బీచ్‌లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించవద్దని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నేహా రెడ్డికి ఈ నెల 2న జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో ఆక్రమణలు తొలగించాలని.. లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు.
 
మరోవైపు, విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో సీఆర్‌జడ్ (కోస్టల్ రెగ్యులేషన్ జోన్) నిబంధనలను ఉల్లంఘించి నేహారెడ్డి కాంక్రీట్ గోడను నిర్మించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులకు ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భీమిలి బీచ్ సమీపంలో శాశ్వత నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పిల్ వేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 
 
కూల్చివేత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ స్థాయి నివేదికను సమర్పించాలని గత నెలలో హైకోర్టు నిర్దేశించి ఆపై తదుపరి విచారణను సెప్టెంబరు 11వ తేదీకి వాయిదా వేసింది. భీమిలి బీచ్ సమీపంలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తరఫున న్యాయవాది పొన్నాడ శ్రీవ్యాస్ వాదనలు వినిపించారు.