1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (19:50 IST)

నేతాజీ జన్మస్థలాన్ని చాలాసార్లు సందర్శించా: బిశ్వభూషణ్

అంతర్జాతీయ స్థాయిలో భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపించి, నాడు ఎంతో మంది యువత స్వాతంత్య్ర ఉద్యమంలో చేరడానికి ప్రేరణగా నిలిచిన నేతాజీ సుబాష్ చంద్రబోస్ చిరస్మరణీయుడని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.

విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాల్‌లో గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. నగర ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్ హరిచందన్  తొలుత నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం కటక్‌లోని నేతాజీ జన్మస్థలాన్ని తాను చాలాసార్లు సందర్శించగలిగినందుకు గర్వపడుతున్నానన్నారు. తన విద్యాభ్యాసం కటక్‌లోనే సాగిందని,  అక్కడి నుంచే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే పలుమార్లు నేతాజీ జన్మస్థలాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించానని వివరించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడన్న గవర్నర్, ఆజాద్ హింద్ ఫౌజ్ ను ఏర్పాటు చేయడం ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారన్నారు.

స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో నేతాజీ దేశం కోసం ఎంతో కృషి చేశారని, గొప్ప నాయకుడిగా, భరతమాత పుత్రునిగా ఆయనకు గర్తుచేసుకోవటం, నివాళి అర్పించటం దేశ పౌరులుగా గర్వ పడవలసిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయిక్త కార్యదర్శి అర్జున రావు మరియు రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మాజీ మేయర్ జంధ్యాల శంకర్, సీనియర్ జర్లలిస్టు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, స్వాతి వార, మాన పత్రిక ఎడిటర్ వేమూరి బలరాం, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముత్తవరపు మురళికృష్ణ‌, పురావస్తు నిపుణుడు ఈమని శివనాగి రెడ్డి, అచార్య ఎం.సి.దాస్, డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డాక్టర్ సమరం, ఎస్.ఆర్.ఆర్, సివిఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెలగా జోషి, గ్రంధాలయ ఉద్యమకారిణి రావి శారద,

ఆకాశవాణి మాజీ సంచాలకులు వేదవతి, కృష్ణకుమారి, గాంధీ నిధి పౌండేషన్ బాధ్యులు వై.రామచంద్రరావుతో పాటు విజయవాడ నగరంలోని పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని నేతాజీ సుబాష్ చంద్రబోస్‌కు నివాళి అర్పించారు.
 
దేశ సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించాలి: గవర్నర్​
దేశం కోసం ప్రతి పౌరుడూ పాటుపడాలని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ సూచించారు.హైదరాబాద్​ నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏక్​ భారత్​ శ్రేష్ఠ భారత్​ పేరుతో నిర్వహించిన యూత్​ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె పాల్గొన్నారు.

ఆధునిక జీవన శైలిని ఆస్వాదిస్తూనే... దేశ సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' పేరుతో నిర్వహించిన యూత్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువత ఏ రంగాన్ని ఎంచుకున్నా సంతోషంగా ముందుకు సాగాలని... నవభారత నిర్మాణం కోసం ఉత్సాహంగా పాలుపంచుకోవాలని సూచించారు. అనుకున్న రంగంలో రాణించలేనప్పుడు మరో రంగాన్ని ఎంచుకోవాలి తప్ప... ఆత్మహత్యల వంటి పిరికి పంద చర్యలకు పాల్పడరాదని కోరారు.

సుభాష్ చంద్రబోస్ యువతకు ఇచ్చిన సందేశాలను గుర్తుచేస్తూ... దేశం కోసం, జాతికోసం ప్రతి పౌరుడూ పాటు పడాలని... ఆయన జ్ఙాపకాలు యువతకు నిరంతరం స్ఫూర్తి అందిస్తూనే ఉంటాయని తెలిపారు . సుభాష్ చంద్రబోస్ ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి 4వ స్థానంలో నిలిచినప్పటికి... స్వతంత్ర భారత్​లో పని చేయడమే లక్ష్యంగా ఉద్యోగాన్ని కూడా వదులుకున్న గొప్పవ్యక్తి అని కొనియాడారు.