1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

పెళ్లింట్లో విషాదం.. పెళ్లి పీటలు ఎక్కవలసిన వరుడు డాబాపై నుంచి పడి మృతి

marriage
విజయనగరం జిల్లా రాజాంలో ఒక పెళ్లింటి విషాదం చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కవలసిన వరుడు ప్రమాదవశాత్తు డాబాపై నుండి జారిపడి మృతి చెందాడు. దీంతో రాజాం పట్టణంలో విషాదచాయలు అలముకున్నాయి. స్థానికుల తెలిపిన సమాచారం ప్రకారం... బుధవారం రాత్రి రాజాం సూర్య దుర్గ కళ్యాణ్ మండపంలో రాత్రి 12.55 నిమిషాలకు వజ్జిపర్తి సూర్యరావు అనే యువకుడికి వివాహం జరగవలసి ఉన్నది. వరుడు సూర్యారావు రాత్రి డాబాపై పడుకున్నాడు. అయితే, ప్రమాదవశాత్తు తెల్లవారుజామున పైనుంచి నిద్రమత్తులో డాబాపై నుంచి క్రిందకు పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
హుటాహుటిన బంధువులు రాజాం ఆసుపత్రికి తీసుకు వెళ్ళగా పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడ చికిత్స పొందుతూ వరుడు మృతి చెందాడు. పెళ్లి పీటలు ఎక్కవలసిన వరుడు అదే రోజు మృతిచెందడంతో పెళ్లింట్లో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వీరి స్వగ్రామం బలిజిపేట మండలం పెద్దపంకి గ్రామం వీరి కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా రాజంలో నూడుల్స్ బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్నారని స్థానికులు తెలిపారు.