మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (14:46 IST)

పానీ పూరీ తినేందుకు వెళ్లి మృత్యువాతపడ్డారు... ఎలా?

పానీ పూరీ ఆరగించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. ఈ విషాదకర ఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్.ఐ నాగేశ్వర రావు వెల్లడించిన వివరాలమేరకు... హైదరాబాద్ తుక్కుగూడ గ్రామానికి చెందిన కట్టెల శ్రీనివాస్ ‌(28) అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ పేట్రోల్ బంగులో పని చేస్తున్నాడు. 
 
అయితే, ఈయనకు పానీపురీ తినాలని ఆశ కలిగింది. దీంతో అతను స్థానిక సిండికేట్‌ బ్యాంక్‌ సమీపంలోని పానీపూరీ బండి వద్దకు వెళ్లి పానీపూరి ఇవ్వాలని యజమాని బాబూరావును కోరాడు. 
 
తానీ, శ్రీనివాస్‌కు బాబూరావు పానీపూరి ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇదే విషయంపై వారిద్ధరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీంతో కోపం పట్టలేక పానీపూరీ బండి అద్దంపై శ్రీనివాస్ బలంగా కొట్టాడు. అతని దెబ్బకు అద్దం పగిలి మోచేతికి గుచ్చుకుంది. 
 
పైగా, శ్రీనివాస్ మోచేయి నరం తెగిపోవడంతో తీవ్ర  రక్తస్రావమైంది. దీన్ని గమనించిన స్థానికులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కాగా అతడి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ అతడి సోదరుడు గణేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.