శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:31 IST)

రైతుల వెతలను వినిపించాడనే లోకేశ్ పై అక్రమ కేసులు: టీడీపీ

రాష్ట్ర రైతాంగం అడుగడుగునా ప్రభుత్వం చేతిలో దగాపడుతోందని, 40, 50 ఏళ్లల్లో ఎన్నడూ చూడని నష్టాన్ని రైతులుఎదుర్కొంటుంటే, వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం, రైతులసమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లిన నారాలోకేశ్ పై విమర్శలు చేయడం, ఆయనపై కేసులు పెట్టడం దారుణమని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, ఆపార్టీ శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

మంగళవారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. కోవిడ్ నిబంధనలు, ప్రభుత్వం చెబుతున్న చట్టాలనేవి కేవలం ప్రతిపక్షపార్టీలకే ఎలా వర్తిస్తాయో సమాధానం చెప్పాలని రామానాయుడు డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజల్లోకి వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏనాడూ మాస్క్ పెట్టుకున్న దాఖలాలు లేవని, అటువంటి వ్యక్తికి వర్తించని కోవిడ్ నిబంధనలు ప్రతిపక్షనేత అయిన లోకేశ్ కు ఎలా వర్తిస్తాయో డీజీపీ సమాధానం చెప్పాలన్నారు.

నిబంధనలు, చట్టాలు అనేవి అధికారపార్టీకి వర్తించవని, అవిప్రతిపక్షానికి మాత్రమే ఎలా వర్తిస్తాయో చెప్పాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు విడదల రజనీ ట్రాక్టర్ తోలినప్పుడు,  రోజా అంబులెన్స్ నడిపినప్పుడు, ఉండవల్లి శ్రీదేవి వరదప్రాంతాలకు వెళ్లేటప్పుడు ట్రాక్టర్ నడిపినా, బియ్యపు మదుసూధన్ రెడ్డి వేలాదిమందితో ట్రాక్టర్ ర్యాలీలు చేపట్టినా వారికెవరికీ వర్తించని కోవిడ్ నిబంధనలు లోకేశ్ కు మాత్రమే ఎలా వర్తిస్తాయో చెప్పాలని నిమ్మల డిమాండ్ చేశారు. 

వైసీపీ ప్రభుత్వంలో రోడ్లపైఉన్న గోతులు కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, ఆర్టీసీ బస్సులుకూడా అదుపుతప్పుతున్నాయని అటువంటి పరిస్థితుల్లో రవాణా శాఖా మంత్రిపై కేసు ఎందుకు పెట్టలేదో పోలీసులు చెప్పాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లపై ప్రజలకు కాస్తో కూస్తో విశ్వాసం ఉందని,  ఆవ్యవస్థలు రెండూ వైసీపీకింద పనిచేసే వాలంటరీ వ్యవస్థలు కాదన్నారు.   

ఆ రెండు వ్యవస్థలు చట్టాలను సక్రమంగా అమలు చేయాలని, ప్రతిపక్షంపై ఒకలా, అధికారపార్టీపై మరోలా వ్యవహరించడం తగదని రామానాయుడు హితవు పలికారు. నారా లోకేశ్ ప్రతి రైతు గడపకు వెళ్లి, కర్షకుల్లో చైతన్యం వచ్చేలా తన పర్యటనలు చేశారని, అది చూసి ఓర్వలేకనే ఆయనపై పాలకులు తప్పుడు కేసులు పెట్టించారన్నారు. వరదలు, వర్షాల కారణంగా రైతులు నష్టపోతే, ముఖ్యమంత్రి మంత్రులు అన్నదాతల ముఖం కూడా చూడలేదన్నారు.

రోడ్లు కూడాలేని ఊళ్లలోకి, నీళ్లలో నానుతున్న ప్రజలవద్దకు నారా లోకేశ్ వెళ్లడాన్ని చూసి అసూయ చెందిన ప్రభుత్వం, ఆయనపై తప్పుడు కేసులు పెట్టించిందన్నారు. రైతులకు సున్నా వడ్డీకింద రుణాలు ఇస్తామని చెప్పి, అందుకోసం రూ.3వేలకోట్లు కావాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, బడ్జెట్లో మాత్రం అందుకోసం రూ.100 కేటాయించాడని, దాన్నే లోకేశ్ ఎత్తిచూపాడన్నారు.

గిట్టుబాటు ధర అందక, సరైన సమయంలో ఎరువులు, విత్తనాలు దొరక్క రైతులు పడుతున్న సమస్యలను లోకేశ్ ప్రభుత్వానికి తెలియచేశాడని, అదే ఆయన చేసిన నేరమన్నారు. రైతుభరోసా పేరుతో జగన్ ప్రభుత్వం, అన్నదాతలను ఎలా మోసగించిందో వారికి తెలిసేలా టీడీపీ యువనేత చెప్పాడన్న అక్కసుతోనే ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టించిందన్నారు.

15 లక్షలమంది కౌలురైతులకు రైతుభరోసా ఇస్తామని చెప్పి, కేవలం 54వేలమందికే ఇవ్వడాన్ని కూడా లోకేశ్ రైతులకు తెలియచేశాడన్నారు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ పథకానికి జగన్మోహన్ రెడ్డి మంగళం పాడుతున్న విధానాన్ని లోకేశ్ ఎండగట్టినందునే ఆయనపై అక్రమ కేసులు పెట్టించారన్నారు.

రాష్ట్ర మంత్రులు రైతులను ఉద్దేశించి మాట్లాడే బూతులభాషను, మంత్రుల వ్యాఖ్యలను రైతులకు అర్థమయ్యేలా చెప్పడమే లోకేశ్ చేసిన నేరమా అని నిమ్మల నిలదీశారు. పశ్చిమగోదావరి జిల్లాకు కేవలం రూ.కోటి40లక్షల ఇన్ పుట్ సబ్సిడీని మాత్రమే ప్రభుత్వం విడుదలచేసిందని, ఆ సొమ్ము మొత్తం కేవలం 2వేలఎకరాలకు మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు.

4లక్షల ఎకరాలకు ఇన్ పుట్ సబ్సిడీ రావాల్సి ఉండగా, ఒక జిల్లాకు కేవలం 2వేల ఎకరాలకు ఇవ్వడమేంటని నిమ్మల మండిపడ్డారు. అదే అంశంపై లోకేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని రైతుల సమక్షంలో నిలదీశారన్నారు.  చంద్రబాబునాయుడి హయాంలో 2014-18లో పోలవరం ప్రాజెక్ట్ 70శాతానికి పైగా పూర్తయిందని, టీడీపీ ప్రభుత్వమే ఉండిఉంటే, ఈపాటికే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయి ఉండేదన్నారు.

అటువంటిప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని కేంద్రం రూ.55,548కోట్లకు ఆమోదిస్తే, జగన్ వచ్చాక అదే వ్యయాన్ని రూ.20వేలకోట్లకు కుదించడం జరిగిందన్నారు. కేంద్రప్రభుత్వం పోలవరానికి ఇంతలా అన్యాయంచేస్తున్నా, జగన్మోహన్ రెడ్డిగానీ, ఆయన ఎంపీలుగానీ తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారని నిమ్మల ధ్వజమెత్తారు.

జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసులుభయంతో రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని, అదే అంశాన్ని లోకేశ్ ప్రజలకు చెబుతున్నాడన్న అక్కసుతోనే, ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టించిందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు క్షేత్రస్థాయిలో రైతులువద్దకు వెళితే, వారికి వాస్తవాలు అర్థమవుతాయని, అది చేయకుండా లోకేశ్ పై విమర్శలుచేయడం ఏమిటని రామానాయుడు నిలదీశారు.

వరదలు వచ్చి 10రోజులుదాటినా కూడా పొలాల్లోంచి నీరు బయటకు పోలేదని, అనేకగ్రామాలు ఇప్పటికీ నీళ్లలోనే నానుతున్నాయన్నారు. బంగ్లాల్లో, రాజప్రాసాదాల్లో కూర్చొనే మంత్రులకు, ముఖ్యమంత్రికి నీళ్లల్లో ఉన్న రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయన్నారు. అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతిరైతుకు ఎకరాకి రూ.25వేలు, ప్రతి కుటుంబానికి నిత్యావసరాలతో పాటు, రూ.5వేలసాయం చేయాలని నిమ్మల డిమాండ్ చేశారు.

జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదేవిధంగా పరిహారం ఇవ్వాలని ఆనాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారన్నారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, రైతులను పట్టించుకోకుండా గాలిమాటలు చెబితే ఎలాగని రామానాయుడు ప్రశ్నించారు.