1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (15:07 IST)

కుప్పం అసెంబ్లీ ఎన్నికల బరిలో నారా భువనేశ్వరి!! ఉత్తరాంధ్ర నుంచి చంద్రబాబు?

bhuvaneswari
ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయభేరీ మోగిస్తుందని ముందస్తు సర్వేలు ఢంకాబజాయిస్తున్నాయి. పలువురు రాజకీయ నేతలు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పం అసెంబ్లీ నుంచి గత 35 యేళ్ళుగా తన భర్త నారా చంద్రబాబునాయుడిని గెలిపించారు. ఈసారి తనను గెలిపిస్తారా? అని కుప్పం ప్రజలను అడిగారు. ఆమె కుప్పంలో నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టారు. 'ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ' అనే అంశంపై కుప్పం మహిళలతో ముఖాముఖి నిర్వహించారుచ ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
కుప్పంలో నాకు మద్దతు ఇస్తారా? చంద్రబాబుగారికి మద్దతిస్తారా? అని అంటూ సభికులను సరదాగా ప్రశ్నించారు. చంద్రబాబును 35 యేళ్లు గెలిపించారు. ఈసారి నన్ను గెలిపిస్తారా? అని అడిగారు. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చినవారంతా ఇద్దరూ కావాలంటూ సమాధానమిచ్చారు. 
 
అలా.. కుదరదు కదా.. ఎవరో ఒకరి పేరు చెప్పాలంటూ నారా భువనేశ్వరి కోరారు. అయితే, ఇది తాను సరదాగా అంటున్నానని చెప్పారు. ప్రస్తుంత తాను చాలా సంతోషంగా ఉన్నానని, రాజకీయాలకు తాను దూరంగా ఉంటానంటూ ఆమె స్పష్టం చేశారు. ఎపుడూ సీరియస్‌గా చర్చలే కాదు.. అపుడపుడూ సరదాగా మాట్లాడుకోవాలని వ్యాఖ్యానించారు. అయితే, కొందరు టీడీపీ నేతలు మరో కోణంలో ఆలోచన చేస్తున్నారు. రాయలసీమలో నారా భువనేశ్వరి, రాజధాని అమరావతి(కోస్తాంధ్ర)లో నారా లోకేశ్, ఉత్తరాంధ్రలో నారా చంద్రబాబు నాయుడులు పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్నారని అభిప్రాయపడుతున్నారు.