మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (20:29 IST)

70 లక్షల మంది తలరాతలు మార్చే బాధ్యత మీది: ఆదిమూలపు సురేష్

రాష్ట్రంలోని 70 లక్షల మంది పిల్లల తలరాతను మార్చే బాధ్యత మీపై ఉందని, విద్యార్థుల బోధన ఏ విధంగా జరిగితే వారికి అర్థమవుతుందో  తగిన విధంగా పుస్తకాలు రూపకల్పన జరగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.

సచివాలయంలోని ఐదవ బ్లాక్ లో జరిగిన ఎనిమిదో తరగతి పుస్తకాల రూపకల్పనపై జరిగిన ప్రిలిమినరీ మీట్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి టెక్స్ట్ బుక్స్ రూపకల్పనలో భాగస్వాములైన 13 జిల్లాలకు చెందిన దాదాపు 130 మంది రచయితలు, పాఠశాల విద్యా కమిషనర్ చిన వీరభద్రుడు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ వెట్రిసెల్వి, ఎస్ఇ ఆర్ టీ డైరెక్టర్ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.... విద్యావ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకు వచ్చి రాష్ట్రంలో విద్య కు అధిక ప్రాధాన్యత ఇచ్చి చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేయన్నారు. నాణ్యమైన విలువలతో కూడిన విద్య అందరికీ సమానంగా అందించాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు.

పాఠ్యపుస్తకాలను ఆకర్షణీయంగా బిలింగ్వేల్ తో రూపొందించడం జరిగిందని, రాష్ట్రంలో రూపొందిస్తున్న పాఠ్యపుస్తకాలు రాబోయే రోజుల్లో పోటీపరీక్షలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పాఠ్యపుస్తకాలు చదివితే పోటీ పరీక్షల్లో విజేతలు కావచ్చని నమ్మకం కలిగే విధంగా టెక్స్ట్ బుక్స్ రూపొందించాలన్నారు. 

మీరు రూపొందించే పాఠ్యపుస్తకాలు రాష్ట్రంలోని 70 లక్షల మంది విద్యార్థుల తలరాతలు మార్చేవని గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న అమ్మ ఒడి, నాడు-నేడు ఇంగ్లీష్ మీడియం విద్య తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. కొత్తగా పాఠ్యపుస్తకాలు రూపకల్పనకు తీసుకున్న నిర్ణయం భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. సీబీఎస్ఈ సిలబస్ కు తగ్గట్టుగా విద్యార్థులను సంసిద్ధం చేయడంలో మీ పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు.
 
పాఠ్యంశాలపై ఎటువంటి విమర్శలు తలెత్తకుండా ఈ మహాయజ్ఞంలో మీ ప్రతిభను వినియోగించి విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా పాఠ్యాంశాలు తయారు చేయాలని కోరారు. రాష్ట్రంలో విద్యా సంస్కరణలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు వివరిస్తూ పలువురు ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి తో పాటు మంత్రి సురేష్ పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి ఆశయం కోసం తాము పనిచేస్తామని ఉపాధ్యాయులు తెలిపారు.