1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (14:11 IST)

మిస్టర్ జగన్... స్టాలిన్‌ను చూసి నేర్చుకో : అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డిపై టీడీపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోమారు మండిపడ్డారు. కరోనా వల్ల రాష్ట్రంలో ఎంతో మంది చనిపోతున్నారని... ఇలాంటి పరిస్థితుల్లో కూడా జగన్ చేస్తున్నది ఏమీలేదని మండిపడ్డారు. 
 
ఇప్పటివరకు 10 వేల మంది చనిపోతే జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిన్న వ్యవసాయ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కూడా జగన్ మాస్క్ పెట్టుకోలేదని... ఈ సమాజానికి ఆయన ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. 
 
ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకున్నారని... ఒక్క జగన్ మాత్రమే పెట్టుకోలేదని దుయ్యబట్టారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతా రాహిత్యంగా నడుచుకోవచ్చా అన్ని ప్రశ్నించారు. 
 
తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు ఎందరో అక్కడి ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌కు చెక్కులు అందించడానికి వెళ్తే ఆయన మాస్కులు పెట్టుకున్నారని... స్టాలిన్ మాస్కులు పెట్టుకుని ఎంతో బాధ్యతగా వ్యవహరించారని అచ్చెన్న కితాబునిచ్చారు. 
 
స్టాలిన్‌కు ఉన్న బాధ్యత జగన్‌కు లేదా? అని ప్రశ్నించారు. పేదల కడుపు నింపేందుకు రూ.5 కే తమ టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు పెట్టిందని... జగన్ సీఎం అయిన తర్వాత వాటిని ఎత్తేసి పేదలు పస్తులతో పడుకునేలా చేశాడని మండిపడ్డారు. వైయస్సార్ పేరు మీదైనా ఆ క్యాంటీన్లు కొనసాగించాలని కోరారు. 
 
రాష్ట్రంలో విధ్వంసం తప్ప మరేమీ లేదని విమర్శించారు. గత మూడేళ్లుగా ఇదే కొనసాగుతోందన్నారు. ప్రజా వేదిక కూల్చివేత మొదలుకుని అమరావతిని ధ్వంసం చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.