1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 30 మే 2019 (16:27 IST)

చంద్రబాబు టీమ్‌పై బదిలీ వేటు.. ఏపీ సీఎం వైస్ జగన్ కీలక నిర్ణయం..

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలోనే వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం)లోని పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది.


సీఎంవో ప్రత్యేక కార్యదర్శి సతీష్ చందర్, ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్‌తో పాటు కార్యదర్శుల హోదాలో కొనసాగుతున్న గిరిజా శంకర్, అడుసుమిల్లి రాజమౌళిపై బదిలీ వేటు వేశారు. పైన పేర్కొన్న వారంతా సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలిచ్చారు. 
 
ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా సీఎం కార్యాలయం అదనపు కార్యదర్శిగా ధనుంజయ్ రెడ్డిని నియమించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు టీమ్‌గా చెప్పుకునే అధికారులపై జగన్ బదిలీ వేటు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
సాధారణంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొత్త నాయకులు ఎవరైనా తమ ఆలోచనలకు లోబడి పని చేసే అధికారులకు సీఎంవో స్థానం కల్పిస్తుంటారు. ఈ క్రమంలోనే ఏపీ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎంవోలోని ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రక్షాళన చేపడతామని చెప్పిన జగన్ మొదటిగా సీఎంవో ఆఫీసులోని ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేయడం గమనార్హం.