1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (11:33 IST)

అసెంబ్లీని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్.. సీఎం జగన్‌తో విజయసాయి మంతనాలు

ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు రాష్ట్ర శాసనమండలి బ్రేక్ వేసింది. దీన్ని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. ఇందులోభాగంగా, సీఎం జగన్‌తో ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గురువారం సమావేశమై తదుపరి పరిణామాలపై వారిద్దరూ చర్చించారు. వారితో పాటు... రాజధాని, సీఆర్డీయే రద్దు కేసుల విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించుకున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి కూడా సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. 
 
ఈ భేటీలో కీలక అంశం వికేంద్రీకరణ బిల్లేనని చెబుతున్నారు. మండలి నిర్ణయం నేపథ్యంలో రాజ్యాంగ, న్యాయపరమైన అంశాలపై వీరంతా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున అసెంబ్లీని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే న్యాయ నిపుణులతో చర్చించాకే ఆయన తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంమీద బుధవారం శాసన మండలిలో జరిగిన పరిణామాలను ముఖ్యమంత్రి అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.