గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 మార్చి 2021 (13:57 IST)

విశాఖ ప్లాంట్‌పై వైకాపా కపట ప్రేమ.. ఎన్నికల కోసం డ్రామాలు : పవన్ కళ్యాణ్

ఎందరో త్యాగాల ఫలితంగా సంపాదించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై అధికార వైకాపా కపట ప్రేమను చూపుతూ, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం డ్రామాలు ఆడుతోందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో వైకాపా ఏమాత్రం చిత్తశుద్ధివున్నా.. ఆ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలకు స్టీల్‌ ప్లాంట్ కోసం ఢిల్లీలో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. 
 
పార్లమెంట్‌ సాక్షిగా తమ వాణిని వినిపించాలన్నారు. అలాకాకుండా కేవలం మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్లకోసం రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేస్తుంటే ప్రజలెవ్వరూ నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. 
 
అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక్క వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన తీసుకురాలేదని వివరించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వసంస్థలు, పరిశ్రమలు నడపడంలో వస్తున్న ఒడిదొడుకుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు.
 
అయినా విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తున్నానన్నారు. ఆ కారణంగానే దిల్లీ వెళ్లి కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసి స్టీల్‌ప్లాంట్‌ ఆంధ్రులకు ఎంత ప్రాధాన్యమైనదో వివరించానన్నారు. నాడు భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలు ఇప్పటికీ పరిహారం కోసం పోరాటం చేస్తున్నాయని గుర్తు చేసినట్టు పేర్కొన్నారు. 
 
ఉక్కు ఉద్యమంలో జరిగిన ఆత్మబలిదానాల త్యాగాలను అమిత్‌షాకు వివరించినట్టు తెలిపారు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రత్యేక దృష్టితో చూడమంటూ వినతిపత్రం సమర్పించినట్టు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.