శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జులై 2020 (15:59 IST)

శభాష్ మోడీ జీ ... మాతృభాషలోనే విద్యాబోధన మంచి నిర్ణయం : పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరోమారు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. నూతన జాతీయ విద్యా విధానం 2020కి ప్రధాని మోడీ సారథ్యంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ విద్యావిధానాన్ని అనేక మంది స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా, విద్యా రంగ నిపుణలు, రాజకీయ నేతలు మంచి నిర్ణయం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరిలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలంటూ కేంద్రం నూతన విద్యావిధానానికి రూపకల్పన చేయడాన్ని జనసేన స్వాగతిస్తోందన్నారు. మాతృభాషలో బోధన జరిగినప్పుడు గొప్ప ఫలితాలు ఆవిష్కృతమవుతాయని యునెస్కో 2008లోనే ప్రకటించిందని గుర్తుచేశారు. 
 
ఇటీవల ఏపీ సర్కారు ఇంగ్లీషు మీడియంపై నిర్ణయం తీసుకున్నప్పుడు జనసేన తీవ్రంగా వ్యతిరేకించింది ఇందుకేనని స్పష్టం చేశారు. అయితే, జనసేన ఇంగ్లీషు మీడియం బోధనకు ఏమాత్రం వ్యతిరేకం కాదని, ఏపీలో ఇంగ్లీషు మీడియాన్ని తప్పనిసరి చేసినప్పుడు మాత్రమే వ్యతిరేకించామన్నారు. 
 
తమ పిల్లలు ఏ భాషలో చదవాలన్నది తల్లిదండ్రుల నిర్ణయానికే వదిలేయాలని, ఇంగ్లీషు మీడియం ఓ ఆప్షన్‌గా మాత్రమే ఉండాలన్నది జనసేన పార్టీ అభిప్రాయం అని పవన్ స్పష్టంచేశారు. తాజాగా, ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే జరగాలని నిర్ణయించిన కమిటీ సభ్యులకు, కమిటీ సిఫారసులను ఆమోదించిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు.