1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 25 జనవరి 2022 (10:53 IST)

సీఎం జ‌గ‌న్ ని చంపేస్తామని... జ‌న‌సేన మ‌ద్ద‌తుదారుడి బెదిరింపులు!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చంపుతామ‌ని ఒక వ్య‌క్తి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఈ మ‌ధ్య సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని వీఐపీలను బెదిరించే ముఠాలు ఎక్కువయ్యాయి . ఇలాంటి ఆకతాయిల ఆట, సైబ‌ర్ సాక్షిగా పోలీసులు కట్టిస్తున్నారు. 
 
 
తాజాగా గుంటూరు సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటి బెదిరింపుల‌కు పాల్ప‌డిన కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. కన్నాభాయ్ అనే వ్యక్తి ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సీఎంని చంపేస్తామంటూ, ట్వీట్స్ చేసిన పవన్ ఫణి అరెస్ట్ అయ్యాడు. అత‌నిని సాంకేతికంగా ప‌ట్టుకుని అరెస్ట్ చేసిన సైబర్ క్రైం ఎస్పీ రాధిక ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 
 
 
మానవ బాంబుగా మారి సీఎంను చంపేస్తానంటూ పోస్టింగులు చేసిన పవన్ ఫణి జనసేన మద్దతుదారుడని, ట్విట్టర్లో పోస్టులు పెట్టి అకౌంట్ తొలగించి ఫోన్ స్విఛ్ఛాఫ్ చేశాడన్నారు. అసభ్యకర పోస్టులు పెడితే వాటిని బయటకు తీయగలిగే సామర్థ్యం ఏపి సీఐడీకి ఉంద‌ని సైబర్ క్రైం ఎస్పీ రాధిక చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. 
 
 
అసభ్యకర, చట్టవ్యతిరేకమైన పోస్టులు పెట్టే ముందు ఆలోచించాలని, లేదంటే వారు ఊచలు లెక్కపెట్టాల్సిందే అన్నారు. అధునాతన సాంకేతిక ఆధారాల ద్వారా అటువంటి పోస్టులు పెట్టే వారిని పట్టుకుంటాం అని చెప్పారు. ఈ కేసులో బెదిరింపులు ఇతను ఒక్కడే చేశాడా? ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది విచారణలో తేలుతుందని  ఎస్పీ రాధిక స్పష్టం చేశారు.